అమరావతి, ఫిబ్రవరి 6: తలసేమియా బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 15న విజయవాడలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాల వివరాలను నారా భువనేశ్వరి, తమన్ మీడియాకు వివరించారు. విజయవాడలో జరగనున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు ఈ షో తాను చేయడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. నారా భువనేశ్వరి ఈ కార్యక్రమం చేయాలి అని తనను అడిగారని.. తలసేమియా భాదితులకు సహాయం కోసం అని చెప్పగానే తాను వెంటనే ఈ కార్యక్రమంకి వస్తా అని చెప్పానన్నారు.
నారా భువనేశ్వరి తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం తనకు అప్పగించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం పగలు రాత్రి పని చేస్తున్నారని, ఈ షో ద్వారా వచ్చే ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఈనెల 15 న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ జరుగుతుందని నారా భువనేశ్వరి తెలిపారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హాజరవుతున్నారని చెప్పారు.
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్ నమ్మారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్టు ఏర్పాటు జరిగిందని ఆమె అన్నారు. రక్తదానం చాలా మంది జీవితాలను నిలబెడుతుందని.. రక్తదానం కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని ఆమె పిలుపిచ్చారు. తలసేమియా బాధితులు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది పడతారని నారా భువనేశ్వరి అన్నారు. వారి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆమె మరొకసారి స్పష్టం చేశారు.