- దానధర్మాలు.. నదీ స్నానాలకు మంచి రోజు
- కుంభమేళాలో స్నానానికి నేడు పోటెత్తనున్న భక్తజనం
ప్రయాగరాజ్, జనవరి 28: ఈ నెల 29న మౌని అమావాస్య రానుంది. కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. ఈ దినాన మౌనదీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగసాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూలబిందువు చంద్రుడు. అమావాస్య కావడంతో ఆ రోజున చంద్రుని ప్రభావం ఉండదు. అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు. వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలి. మన మనసుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడుతామో ఏం చేస్తామో తెలియదు. అందుకే పూర్తిగా మౌనంగా ఉండాలి. దీంతో అంతఃశుద్దీకరణ జరుగుతుంది. మాటలపై నియంత్రణ ఎలా ముఖ్యమో భగవద్గీతలోని ఒక పద్యం ఇలా వివరిస్తుంది. మానవునికి అతని మనస్సే పెద్ద సాయం చేస్తుంది. ఏ నిర్ణయమైనా మనసే మంచిదో కాదో చెబుతుంది.
దీని ప్రకారంగా మనల్ని మనం బాగు చేసుకోవాల్సివుంటుంది. అంతేగాని పెడమార్గం పట్టరాదు. పరిపూర్ణమైన మనసు మిత్రుడిగా ఉంటుంది. కలుషితమైతే శత్రువుగా మారుతుంది. ఆధ్మాత్మికంగా ఈ రోజు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి. ఈ సమయంలో పుణ్యస్నానమాచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ఇంత పవిత్రదినం కావడంతో ఈ రోజే కొత్తగా నాగ సాధువుల్లో చేరేవారికి దీక్షఇస్తారు. రావిచెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెట్టాలి. హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రాధాన్యత ఉంది. ఆ రోజున విష్ణుమూర్తి, సూర్యభగవానులను పూజిస్తారు. ముఖ్యంగా పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య మరింత ప్రత్యేకమైంది. ఈ రోజున రాగిగిన్నెలో స్వచ్ఛమైన నీరు, ఎర్ర చందనం, ఎర్రటి పూలు వేసి.. ఆ నీటిని సూర్యుడికి సమర్పించాలి. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉపవాసం ఉండి దానధర్మాలు చేయాలి. తులసి మొక్కను పూజించి, తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
ఇలా చేయడం వల్ల పితృ దేవతల దోషాలేమైనా ఉంటే తొలగిపోతాయి. పురాణ కథనం ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి అమృతంగా మారి ఆకాశం నుంచి కిందికి దిగివస్తుంది. ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే పరమపుణ్యమని, అలా అవకాశం లేకుంటే మరే నదిలోనైనా స్నానం చేయాలన్నది పెద్దల మాట. పుష్య అమావాస్య రోజున చేసే సత్కార్యాలకు గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఈ అమావాస్యను లఘు పితృపక్షంగా పరిగణిస్తారు. ఈ రోజున భగవద్గీత పఠించాలి. రావిచెట్టుకు నీరుపోసి, దాని వద్ద దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల కూడా పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ క్రమంలో మహా కుంభమేళా దారులు పవిత్ర ప్రయాగ్ రాజ్ వైపే.. భక్త జనసంద్రానికి తీరమా.. అన్నట్టుగా త్రివేణి సంగమం సకల జనుల సందడితో కిక్కిరిసిపోతుంది.. విభుడు, దేవాదిదేవతలు దివి నుంచి దిగి వచ్చే అమృత కాలమే మహా కుంభమేళ. ఈ 45 రోజుల్లో ఏ రోజులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.
అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధుసంతులు, అఘోరాలు, మాన్యులు, సామాన్యులు ప్రయాగ్ రాజ్కు పోటెత్తుతున్నారు. ఇప్పటికే కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించారు. ఇన్ని రోజులు ఒక లెక్క. ఈ నెల 29న పోటెత్తే రద్దీ మరో లెక్క. బుధవారం మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన సుదినం.. మహాకుంభ మేళలో స్నానమాచరించడమే ఎంతో పుణ్యం. ఇక మాఘ మాస మౌని అమావాస్య కలిసొచ్చిన వేళ.. గంగా స్నానం చేస్తే మరెంతో పుణ్యం. దానాలు చేస్తే జన్మ ధన్యం అనేది భక్తుల విశ్వాసం.. మౌని అమావాస్య రోజున అందరూ షాహి స్నాన్ ఆచరిస్తారు.. మౌని అమావాస్య ధ్యానానికి జ్ఞానానికి చిహ్నం. ఆరోజు మౌనంగా వుంటూ ..పరమేశ్వుడిని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానంచేసి పితృదేవుళ్లకు నీరాజనాలు అర్పిస్తారు. తద్వారా పూర్వీకులకు సద్గతులు కలగడం సహా అందరికీ సకల శుభాలు కలుగుతాయంటారు పండితులు. మహాకుంభమేళానే ఎంతో మహిమాన్వితం.
ఇక ఈసారి మౌని అమావాస్య కలిసిరావడం మరెంతో శుభప్రదం..ప్పటికే మహా కుంభ మేళాలకు కోట్లలో తరలి వస్తున్నారు భక్తులు.ఇక మాఘ మాస మౌన అమావాస్య ఒక్కరోజే పది కోట్లకు మంచి భక్తులు తరలి వస్తారనేది అంచనా. మౌన అమావాస్య కోసం భారత రైల్వే 150 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎవరికీ ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా యూపీ సర్కార్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.