మెదక్, డిసెంబర్ 25: వందేళ్లు పూర్తిచేసుకున్న మెదక్ చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు విజ్ఞప్తి మేరకు మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానని.. సీఎం హోదాలో మళ్లీ వస్తానని అప్పట్లో మాటిచ్చానని రేవంత్రెడ్డి గుర్తుచేసుకున్నారు.
క్రిస్మస్ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లలో దళిత, గిరిజన కైస్త్రవులకు అత్యధికంగా లబ్ది చేకూరుతుందన్నారు. ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10లక్షలకు పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం వివరించారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని తెలిపారు.
చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. శతాబ్ది ఉత్సవాలు, భక్తులతో క్రిస్మస్ జరుపుకోవాలనే ఇక్కడకు వచ్చానని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని.. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో దళితులు, గిరిజనులకు మేలు జరుగుతోందన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్తో పాటు మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పాల్గొన్నారు.