హైదరాబాద్ నగరవాసులకు జలమండలి కీలక అలర్ట్ జారీ చేసింది. కృష్ణా ఫేజ్-1లో చేపట్టనున్న కీలక మరమ్మత్తు పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 36 గంటల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ప్రకటించింది.
జలమండలి వివరాల ప్రకారం, డిసెంబర్ 27 ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులు కొనసాగుతాయి. ఈ సమయంలో హైదరాబాద్ నగరంలోని అనేక డివిజన్లలో నీటి సరఫరా నిలిచిపోతుంది.
కృష్ణా ఫేజ్-1 వ్యవస్థలోని సర్జ్ ట్యాంక్ వద్ద 700 మిమీ డయా ఎంఎస్ పైప్లైన్లో లీకేజీ ఏర్పడడంతో మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2200 మిమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్లో దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వులు మార్పిడి చేయనున్నారు.
ఇంకా నాసర్లపల్లి వద్ద 600 మిమీ డయా ఎంఎస్ జంక్షన్ పనులు, కోదండాపూర్ మరియు నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్లలో ఉన్న దెబ్బతిన్న BF వాల్వులు, NRV లను కూడా మార్పిడి చేస్తారని అధికారులు తెలిపారు. ఈ సమగ్ర పనుల కారణంగానే నగరంలో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
🚱 నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు:
-
డివిజన్ I: మీరాలం, కిషన్బాగ్, బాల్షెట్టీ కేట్, మొగల్పురా, ఫలక్నామా, బహదూర్పురా, జహనుమా
-
డివిజన్ II: మహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, వినయ్నగర్, సైదాబాద్, చంచల్గూడ, ఆస్మాన్గఢ్, యాకుత్పురా
-
డివిజన్ IV: బొగ్గులకుంట
-
డివిజన్ V: నారాయణగూడ, ఆడిక్మెట్, శివం, చిల్కలగూడ రిజర్వాయర్లు
-
డివిజన్ VIII: అలియాబాద్, రియాసత్ నగర్ రిజర్వాయర్లు
-
డివిజన్ X: దిల్సుఖ్నగర్లోని కొన్ని ప్రాంతాలు
-
డివిజన్ XVIII: హార్డ్వేర్ పార్క్, జల్పల్లి, తుక్కుగూడ, ఫాబ్ సిటీ
-
డివిజన్ XX: మన్నెగూడా
జలమండలి అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ — నీటి సరఫరా నిలిచే ప్రాంతాల్లోని వినియోగదారులు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరమ్మత్తు పనులు పూర్తైన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.









