చంపాపేట డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వాటర్ వర్క్స్ అధికారులచే కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి కి బస్తీవాసులు పలు సమస్యలను వివరించారు. దానిలో భాగంగా ఇట్టి కాలనీ నందు నూతన రోడ్ల నిర్మాణం కోసం రోడ్లు తవ్వడం జరిగింది అని తెలిపారు. కానీ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచాక రోడ్లు వేయాలని, అనవసరంగా ముందే రోడ్లు తవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని తెలిపారు. కావున నూతన డ్రైన్స్ నిర్మాణం చేపట్టాక రోడ్లు వేయాలని కోరారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇట్టి రోడ్లు గతంలో మంజూరు చేయడం జరిగిందని, కానీ ఇక్కడ డ్రైన్స్ వ్యవస్థ సరిగ్గా లేదని తెలిసి తాత్కాలికంగా రోడ్డు నిర్మాణ పనులు అపి, నూతన డ్రైన్స్ నిర్మాణాలు చేశాక రోడ్లు వేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అన్నారు.
కావున ఇప్పుడు ఉన్న ఎనిమిది ఇంచుల డ్రైన్స్ స్థానంలో పన్నెండు ఇంచుల డ్రైన్స్ నిర్మాణం చేపట్టాలని అలాగే మిగిలిన మూడు గల్లీలలో ఎత్తుపల్లాలు సరిగ్గా చూసుకొని డ్రైన్స్ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచాక అనంతరం నూతన రోడ్ల నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. అలాగే ఇట్టి డ్రైన్స్ పనుల్లో భాగంగా ఒక వారం, పది రోజులు కొంతమేర ఇబ్బందులు జరుగుతాయి కావున కాలనీవాసులు అధికారులకు మీ యొక్క సహాయ, సహకారాలు అందించాలని కోరారు. రాబోయే రోజుల్లో శుభోదయ కాలనీవాసులకు డ్రైన్స్ పనుల్లో శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు రమ్యభారతి, షబ్బీర్, శ్రీహరి, శ్రీనివాస్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ భారస నాయకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.