హైదరాబాద్, ఫిబ్రవరి 15: జంతు బలిని సంత్ సేవాలాల్ మహారాజ్ వ్యతిరేకించారని మాజీ మంత్రి, సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమీర్ పేట డివిజనులోని బాపూనగర్ లో శనివారం నిర్వహించిన సేవాలాల్ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బంజార సంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహనీయులు సంత్ సేవాలాల్ అని కొనియాడారు. జంతు బలిని వ్యతిరేకించి బంజారాల్లో శాకాహారాన్ని ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. తద్వారా వారికి సాత్వికమైన,స్థిరమైన జీవన విధానం అలవరిచారన్నారు. అంతేకాకుండా ధర్మ ప్రచారం, ఆర్ధిక సంస్కరణలు తీసుకురావడం, మత మార్పిడులను అరికట్టడం వంటివి చేశారన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అమీర్ పేట డివిజన్ ప్రధాన కార్యదర్శి నామన సంతోష్ మణి కుమార్, నాయకులు అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, శేఖర్, ప్రకాష్ గౌడ్, బలరాం, నిర్వహకులు హరిసింగ్, గోపిలాల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
