హైదరాబాద్, ఫిబ్రవరి 12: దశాబ్దాల దళిత వర్గీకరణ పోరాటాన్ని గుర్తించి మాదిగ జాతికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తామంతా రుణపడి ఉంటామని మాదిగ మరియు మాదిగ అనుబంధ కులాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మేడి పాపయ్య మాదిగ అన్నారు. బుధవారం బషీర్బాగ్ జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మాదిగ మరియు మాదిగ అనుబంధ కులాల నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మేడి పాపయ్య మాదిగ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్ట మొదటి సారిగా సుప్రీంకోర్టు తీర్పును అమలుపరిచి, దళిత వర్గీకరణతో దేశానికి మార్గ నిర్దేశం చేశాడని కొని ఆడారు. తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కో చైర్మన్ దామోదర్ రాజనర్సింహ లకు కృతజ్ఞతలు తెలిపారు.
వర్గీకరణ కోసం అమరులైన మాదిగ నేతల త్యాగం వృధా కాలేదని అన్నారు. మాలలు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని, నిరాధారమైన ఆరోపణలు చేసి గందరగోళాన్ని సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లను అన్ని వర్గాలు స్వాగతించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంగీతం రాజలింగం, ఇటుక రాజు మాదిగ, కొండేటి మల్లన్న, ప్రొఫెసర్ మల్లేష్, చింత స్వామి మాదిగ, మేరీ మాదిగ, జన్ను కనకరాజు మాదిగ, వెంకటేష్, బాణాల మంగేష్ తదితరులు పాల్గొన్నారు.