- ఇలా వస్తాయని ఊహించలేదంటున్న ఊర్వశి రౌతేలా
‘డాకు మహారాజ్’లో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తో కలిసి నటించారు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. ఇందులో బాలయ్యతో కలిసి ఆమె ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ పాట విడుదలైన సమయంలో కొరియోగ్రఫీపై వచ్చిన కాంట్రవర్సీ గురించి తాజాగా ఊర్వశీ రౌతేలా స్పందించారు. ప్రేక్షకుల నుంచి ఈవిధమైన స్పందన తాను అస్సలు ఊహించలేదని అన్నారు. ఆ పాట, అందులోని స్టెప్పులను ప్రేక్షకులు ఆదరిస్తారనుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఈవిధంగా మాట్లాడతారని తాను అస్సలు అనుకోలేదని తెలిపారు. ‘రిహార్సల్స్ అంతా ప్రశాంతంగా జరిగింది. అన్ని పాటలకు ఏవిధంగా కొరియోగ్రఫీ ఉంటుందో అదేవిధంగా ఈ పాటకూ చేశాం. శేఖర్ మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పటికే నాలుగుసార్లు ఆయనతో కలిసి వర్క్ చేశాను. ఆయన స్టెప్పులు చెప్పినప్పుడు నాకు ఏమాత్రం విభిన్నంగా లేదా అభ్యంతరకరంగా అనిపించలేదు. సాధారణమైన స్టెప్పుల మాదిరిగానే భావించా. కానీ, పాట విడుదలయ్యాక సోషల్విూడియాలో వచ్చిన విమర్శలు చూసి షాకయ్యా.
కొరియోగ్రఫీని ప్రేక్షకులు తప్పుపట్టడానికి కారణం ఏమిటో అంచనా వేయడానికి కూడా సమయం లేకపోయింది. అంతా సడెన్గా జరిగిపోయింది. రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయని మేము అస్సలు ఊహించలేదు. రిహార్సల్స్ క్లిప్స్ విడుదల చేసినప్పుడు ఎలాంటి విమర్శలు రాలేదు‘ అని ఊర్వశీ రౌతేలా తెలిపారు. ఏదేమైనా సోషల్విూడియా వేదికగా కొంతమంది కావాలని చేసే వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అన్నారు. వివరణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని చెప్పారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ’డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదలైంది. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, బాబీ దేవోల్ కీలక పాత్రల్లో నటించారు. ఊర్వశీ రౌతేలా అతిథి పాత్ర పోషించారు. తమన్ స్వరాలు అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఇది నిర్మితమైంది. సుమారు రూ.100 కోట్లకు పైగా ఇది వసూలు చేసినట్లు అంచనా.