హైదరాబాద్, ఫిబ్రవరి 12: జీహెచ్ఎంసీ కార్మికులు చేస్తున్న సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చిన ఐఎన్టీయూసీ అనుబంధ మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో జరిగిన జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల సమావేశంలో ఐఎన్టీయూసీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి, కనీస వేతనాల బోర్డు చైర్మన్ జనక్ప్రసాద్, సత్యజిత్రెడ్డి, ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అదిల్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి ఏవీఎస్ గాంధీ, అదనపు ప్రధాన కార్యదర్శి శివకుమార్, టీజేఏసీ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఐఎన్టీయూసీ, జీహెచ్ఎంసీ కార్మిక యూనియన్ నాయకులతో కలిసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. ఈ సందర్భంగా హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిళ్లకు చెందిన పలువురు ఉద్యోగులు, కార్మికులు సంజీవరెడ్డి సమక్షంలో ఐఎన్టీయూసీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జోనల్ ప్రెసిడెంట్ శివకుమార్, కార్యదర్శి శరణ్జిత్ సింగ్, నాయకులు శివరాజ్, మహేష్, నరసింహ, యాదగిరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.