- కోళ్ల రావాణా జరక్కుండా చర్యలు
- బర్డ్ఫ్లూతో సరిహద్దుల్లో తనిఖీలు
సూర్యాపేట, ఫిబ్రవరి 11: ఎపిలో బర్డ్ఫ్లూ కారణంగా ఆంధ్రా నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. బాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో ఆంధ్రా నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుండా పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 6 వ తేదీన ఆదేశాలు జారీ చేయడంతో రోజుకు ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున వెటర్నరీ సంబంధిత అధికారులు సరిహద్దు తనిఖీ విధుల్లో ఉన్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభించిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల్లో వైరస్తో లక్షల కోళ్లు చనిపోతున్నాయి. మరీ ముఖ్యంగా.. తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీంతో.. రెడ్ జోన్, సర్వేలెన్స్ జోన్లు ఏర్పాటు చేశారు. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్టీల్లో సేకరించిన శాంపిల్స్కు బర్డ్ ఫ్లూ పాజిటివ్?గా నిర్దారణ అయింది.
ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడ్డాయి. ఒక్కో పౌల్టీ ఫాంలో రోజుకు 10 వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను ఇప్పటికే పూడ్చి పెట్టడం, కాల్చేయడం చేస్తున్నారు. ఇప్పటికే 75 శాతం వైరస్ సోకిన కోళ్లు, కోడిగుడ్లను కాల్చి వేసినట్లు పౌల్టీ యజమానులు తెలిపారు. గడచిన ఐదారు రోజుల్లో పౌల్టీ నుంచి కోళ్లను ఏయే ప్రాంతాలకు వాహనాల ద్వారా రవాణా చేశారో ఆరా తీయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.