మూడురెట్లు పెరిగిన శిలాజేతర ఇంధన వినియోగం

  • సౌర ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపుతో మూడోదేశంగా గుర్తింపు
  • ఇంధన వార్షికోత్సవాలను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: శిలాజేతర ఇంధన శక్తి ఉపయోగంలో భారతదేశం వాడుక మూడురెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని డబుల్‌ చేసి మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా భారత్‌ నిలిచిందని మెచ్చుకున్నారు. భారత్‌ ఇంధన వార్షికోత్సవాలు 2025ను ప్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా తన వృద్ధిని సాధించడంతో పాటు ప్రపంచ వృద్ధి రేటును నడిపిస్తోందని ప్రశంసించారు. ఇంధన రంగంలో భారత్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. 21వ శతాబ్దం భారత్‌దేనని ప్రపంచంలోని నిపుణులు చెబుతున్నారని, వనరులు, మేధో సంపత్తి, ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వం, ప్రపంచ సుస్థిరతపై భారత్‌కు నిబద్ధత ఉందని మోడీ స్పష్టం చేశారు.

2030 సంవత్సరం నాటికి జీరో కర్బన ఉద్గార లక్ష్యాన్ని పెట్టుకున్నామని, ప్రతి సంవత్సరం ఐదు మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. పారిస్‌ జి20 ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న తొలి దేశం భారతేనని, రానున్న రెండు దశాబ్దాలు భారత దేశానికి అత్యంత కీలకమని ఆయన తెలియజేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యాక్షన్‌ కమిటీ సమావేశానికి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌, పిఎం మోడీ అధ్యక్షత వహిస్తున్నారు. ఫ్రాన్స్‌ పర్యటన అనంతరం మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మోడీ సమావేశం కానున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News