- 65వ జాతీయ రహదారిలో వెళ్లే వాహనాల దారి మళ్లింపు
హైదరాబాద్, ఫిబ్రవరి 11: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పెద్దగట్టు జాతర ఈనెల 16 నుంచి 19 వరకు జరగనుంది. యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమంతులస్వామి ఇక్కడ పూజలందుకోనున్నాడు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జాతర ఏర్పాట్ల కోసం ఇటీవల రూ.5 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది 10-15 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారని అంచనా. జాతర నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. 65వ జాతీయ రహదారిపై వాహనాల దారి మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈనెల 16న తెల్లవారుజాము నుంచి దారి మళ్లింపు, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. వాహనదారులు సహకరించాలని కోరారు.