కుంభమేళాకు హాజరైన రాష్ట్రపతి ముర్ము

  • ఘనంగా స్వాగతించిన సిఎం యోగి, గవర్నర్‌ ఆనందీబెన్‌
  • త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ద్రౌపది

ప్రయాగరాజ్‌, ఫిబ్రవరి 10: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరిన ముర్ము.. 10 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. త్రివేణీ సంగమ ప్రాంతంలో పడవలో విహరించారు. ఈ సందర్భంగా సంగమం వద్ద వలస పక్షులకు ఆహారం అందించారు. అనంతరం గంగా, యమునా, సర్వసతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి గంగమ్మకు ప్రార్థనలు చేశారు. రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్‌లో ఎనిమిది గంటలకు పైగా ఉండనున్నారు. బడే హనుమాన్‌ ఆలయం, పవిత్రమైన అక్షయవత్‌ వృక్షాన్ని సందర్శిస్తారు.

అదేవిధంగా కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ కుంభ్‌ అనుభవ్‌ సెంటర్‌ను పరిశీలిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు ప్రయాగ్‌రాజ్‌ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరుతారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. జనవరి 13న పుష్య పౌర్ణమి సందర్భంగా మహాకుంభ్‌ మేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటివరకూ 42 కోట్ల మందికి పైగా భక్తులు గంగానదిలో పవిత్రస్నానాలు ఆచరించారు. కాగా, ఈ నెల 5న ప్రధాని మోదీ కూడా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించారు. గంగానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. 90 నిమిషాల పాటు ఆయన మహాకుంభమేళాలో గడిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News