న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ఇలాంటి ఘటనలు టెన్షన్ కలిగిస్తున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా జనవరి 29వ తేదీన కుంభమేళాలో తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఆ ఘటనలో 30కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 60 మంది గాయపడ్డారని సమాచారం. తాజాగా శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుంభమేళా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఇది నాలుగోసారి. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాల కోసం కోట్లలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కోరుతున్నారు.