ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నాం

  • రానున్న రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు పెరగవద్దు
  • సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ పథకాలను వేగవంతం చేయాలి
  • జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల
  • మంత్రులకు సిఎం చంద్రబాబు సూచన

అమరావతి, ఫిబ్రవరి 6: ఎన్నికల్లో ఇచ్చిన హావిూలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. సమగ్ర పవర్‌ మేనేజ్‌మెంట్‌తో రానున్న రోజుల్లో విద్యుత్‌ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగటానికి వీల్లేదన్నారు. సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, విద్యుత్‌ ఎస్‌ఈలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హావిూని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత ఆయన కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలకంగా వ్యవహరించి ప్రచారం నిర్వహించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై మంత్రులతో చర్చించారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు.

అన్నదాత సుఖీభవకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్రం మరో రూ.14 వేలు కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతోపాటు మూడు విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు. ఎన్ని పెట్టుబడులు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకు తగ్గట్టు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నకిలీ రిజిస్టేష్రన్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలని సీఎం అన్నారు. అందరూ గేరు మార్చాలని సూచించారు. మొదటి ఆరు నెలలు మంత్రుల పనితీరును అంతగా పట్టించుకోలేదు. ఇకపై ఎవరినీ ఉపేక్షించను. నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.

ఆప్కోస్‌ ద్వారా కాకుండా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని శాఖల వారీగా తీసుకోవచ్చు. వాట్సప్‌ గవరెన్స్‌కు మంచి స్పందన వస్తోంది. వివిధ పథకాల అమలు తీరుపై చేయిస్తోన్న సర్వేల్లో సానుకూల స్పందన వస్తోంది‘ అని అన్నారు. ఇకపై నాణ్యమైన, పోషక విలువలు కలిగి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. మెనూలో చేసిన మార్పులపై సమావేశంలో లోకేశ్‌ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో తీసుకొచ్చిన మార్పులను లోకేశ్‌ ప్రస్తావించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సహకారాన్ని లోకేశ్‌ కోరారు. ఈ పథకం అమలుకు అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News