- ఉపాధి, ఉద్యోగాల వేటలో మోసపోతున్న నేటితరం
- కేంద్రం అసమర్థ విధానాలే దీనికి కారణం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: యువత డాలర్ కలలు కల్లలవుతున్నాయి. అమెరికా వెళ్లి నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనుకున్న వారి ఆశలు గల్లంతవుతున్నాయి. దేశంలో ఉద్యోగాలు దొరక్క, ఉపాధి దక్కక విధిలేని పరిస్థితుల్లో లక్షలాది మంది ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ అమెరికా, ఆస్టేల్రియా, కెనడా, దుబాయ్, గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. కొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. అమెరికా లాంటి దేశాల్లో ట్రంప్ లాంటి వారు రావడంతో తట్టుబుట్టా సర్దుకోకుండానే తిరుగు టపా కట్టాల్సి వస్తోంది. ఇలాంటి ఘటనలు కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. దేశంలో వనరులు ఉన్నా, చేసుకునేందుకు పనివున్నా, అవకాశాలు కల్పించకపోవడం వల్లనే ఈ దర్గతిఏర్పడుతోంది. దీనిపై పార్లమెంటు చర్చించాలి.
తాజాగా మరోమారు అమెరికా కలలు కంటూ.. తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకొని అక్కడికి వెళ్లిన వారి ఆశలు అడియాశలు లయ్యాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఈక్రమంలో వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపించింది. మొత్తంగా 104 మంది ఆ విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. అక్రమమార్గంలో విదేశాలకు వెళ్లొద్దని కోరుతున్నా ఆవేదన వ్యక్తంచేశారు. భారత్కు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన సైనిక విమానం బుధవారం అమృత్సర్కు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇందులో అమెరికా వెనక్కి పంపిన వారిలో 33 మంది చొప్పున హరియాణా, గుజరాత్ల నుంచి, 30 మంది పంజాబ్ నుంచి, ముగ్గురేసి చొప్పున మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ల నుంచి, ఇద్దరు చండీగఢ్ నుంచి ఉన్నారు. అమృత్సర్కు తీసుకొచ్చిన వారిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. అమృత్సర్కు చేరుకున్న అక్రమ వలసదారులను పోలీసులు తనిఖీ చేసి, వారి వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు .దీంతో అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మబలికిన ఏజెంట్కు రూ.42 లక్షలు ఇచ్చి హర్వీందర్ సింగ్ దారుణంగా మోసపోయాడు. ఆయనది పంజాబ్లోని హోషియాపుర్కు చెందిన తహ్లీ గ్రామం. తర్వాత వీసా రాలేదని చెప్పడంతో దిల్లీ నుంచి ఖతర్.. అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్లి నానాయాతన పడుతూ అమెరికా వెళ్లాడు.
ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్తో ఉన్న డబ్బు పోయి, ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే వచ్చి నిల్చున్నారు. దారాపుర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ కూడా ఇలాంటి దుస్థితినే ఎదుర్కొన్నారు. 15 గంటల పాటు సముద్ర ప్రయాణం చేసి, దాదాపు 45 కి.విూ. పర్వతమార్గంలో ముందుకెళ్లారు. ‘ఎవరైనా గాయపడితే.. వారి పరిస్థితి అంతే. మిగిలేది మరణమే. దారివెంట ఎన్నో మృతదేహాలను చూశాం. ఇక కొద్దిసేపట్లో మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో అడుగుపెడతామనగా జలంధర్కు చెందిన ఓ వ్యక్తి అరెస్టు కావడంతో మా ప్రయణం అంతా వృథా అయింది. దాంతో మమ్మల్ని 14 రోజులపాటు చీకటి గదుల్లో బంధించారు.
సూర్యుడు జాడే లేకుండా పోయింది. అక్కడ వేలాది మంది పంజాబీ కుటుంబాలకు చెందిన యువకులు, పిల్లలు కనిపించారు. అందరిదీ ఒక్కటే దుస్థితి. ఇలాంటి దుస్తితి ఎందుకన్నదే ప్రశ్న. మనదేశంలోనే మనం పనిచేసుకునే అవకాశాలు పెరగాలి. అప్పుడే దేశ ఆర్థిక పరిస్థితి కూడా పెరగగలదని ప్రభుత్వం గుర్తించాలి.