- బడ్జెట్ సమావేశాలు.పలు సమస్యలపై చర్చ
అమరావతి, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీకి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలిలో కీలక చర్చ జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై క్యాబినెట్ విూటింగ్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. ఏపీలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపైనా క్యాబినెట్లో మంత్రులు చర్చించే అవకాశం కనిపిస్తోంది. క్యాబినెట్ సమావేశాల్లో పలు అంశాలకు మంత్రిమండలి ఆమోదముద్ర పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వైరల్ ఫీవర్తో బాధపడుతున్న డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కేబినేట్ విూటింగ్కు హాజరు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేయబడిన 22-ఏ భూముల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. విశాఖ పంచగ్రామాల సమస్యపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుటికే ఆ భూములకు సంబంధించి ఏపీ సర్కార్ పరిష్కారం చూపించింది. అయితే స్థానికులకు ప్రత్యామ్నాయంగా అదే విలువ కలిగిన భూముల కేటాయించాలని చంద్రబాబు సర్కార్ యోచిస్తోంది. దానిపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎస్ఐపీబీలో ఆమోదించిన రూ.44.776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,580 మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందనున్నారు.