నెరవేరిన ఉత్తరాంధ్ర వాసులు కల

  • విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌
  • విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు
  • కేంద్ర నిర్ణయంపై ఎంపి శ్రీభరత్‌ హర్షం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం పండగలాంటి వార్త చెప్పింది. విశాఖపట్నం రైల్వే డివిజన్‌, విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ పరిధిలను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఎన్నో ఏళ్ల తరవాత ఇలా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరింది. విశాఖ రైల్వే అభివృద్ధికి చారిత్రాత్మక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రకటించింది. కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. వాల్తేర్‌ డివిజన్‌ పేరును విశాఖపట్నం డివిజన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ డివిజన్‌ పరిధిని కూడా మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు రిలీజ్‌ అయ్యాయి. సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి. రాయగడ రైల్వే డివిజన్‌ పరిధిని కూడా ఖరారు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ డివిజన్‌లో 410 కిలోవిూటర్లు పరిధిని చేర్చారు రైల్వే అధికారులు.

కొండపల్లి – మొటుమర్రి సెక్షన్‌ను సికింద్రాబాద్‌ డివిజన్‌ నుంచి విజయవాడ డివిజన్‌గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నో రోజులుగా ఉత్తరాంధ్ర వాసులకు చిరకాల వాంఛగా ఉన్న సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ పరిధిని నిర్ణయించడంతో పాటు విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటు విశాఖ రైల్వే డివిజన్‌ పరిధిలో మొత్తం 410 కిలోవిూటర్ల రైల్వే ట్రాక్‌ను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ డివిజన్‌ పరిధిని కూడా మార్చింది కేంద్రం. విశాఖ డివిజన్‌ పరిధిలో ఏయే మార్గాలను చేరుస్తున్నారనే విషయాన్ని కూడా వెల్లడిరచింది కేంద్రం. అదే విధంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను మార్చారు. విశాఖ రైల్వే డివిజన్‌లో పలాస నుంచి విశాఖపట్నం దువ్వాడ, కూలేరు నుంచి విజయనగరం, నవపాడు జంక్షన్‌ వరకు.. సింహాచలం నార్త్‌ నుంచి దువ్వాడ బైపాస్‌ వరకు.. వడ్లపూడి నుంచి దువ్వాడ-విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ వరకు రైల్వే ట్రాక్‌ మొత్తం విశాఖ రైల్వే డివిజన్‌లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది.

రాయగడ రైల్వే డివిజన్‌లోని కొన్ని మార్గాలను విశాఖపట్నం రైల్వే డివిజన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. రెండు డివిజన్ల పరిధిని ఖరారు చేశారు. విశాఖ రైల్వే డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేయడంతో సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ పరిధిలోకి దాన్ని మార్చేశారు. ఇంతకు ముందు గుంటూరు, గుంతకల్లు, విజయవాడ రైల్వే డివిజన్‌లు సౌత్‌ ఇంట్రన్‌ రైల్వే పరిధిలో ఉండేవి.. ఇప్పుడు వీటన్నింటినీ సౌత్‌ కోస్టల్‌ రైల్వే పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వాల్తేరు రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూ, విశాఖపట్నం డివిజన్‌గా పేరు మార్చుతూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం చేయడంతో పాటు, రైల్వే ఉద్యోగుల్లో సందేశాలను తొలగించింది. 132 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను కొనసాగిస్తోంది కేంద్రం. వాల్తేరును ’విశాఖపట్నం డివిజన్‌’ గా పునర్‌ నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌ హర్షం వ్యక్తం చేశారు.

విశాఖ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ కేంద్రం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం విశాఖ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందన్నారు. ఈ 4 డివిజన్లతో విశాఖపట్నం రైల్వే మరింత బలోపేతం కానుంది. మెరుగైన మౌలిక వసతులు, రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ శ్రీభరత్‌ వివరించారు. విశాఖపట్నం డివిజన్‌ ఏర్పాటుతో రైల్వే మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెందనున్నాయని శ్రీ భరత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత మద్దతు వచ్చే అవకాశం ఉంది. దాంతో రానున్న రోజుల్లో విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు హబ్‌గా మారనుంది. రైల్వే ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, కొత్త రైళ్ల ప్రవేశం, ఆధునికీకరణ ప్రణాళికలు, మెరుగైన ప్రయాణ అనుభవానికి ఇదొక కీలక పరిణామని ఎంపీ శ్రీభరత్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కి, సీఎం చంద్రబాబు కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News