దేశ రాజధాని ఢిల్లీలో ఓట్ల పండుగ

  • అందరూ ఓటేయాలని ప్రధాని మోడీ పిలుపు
  • ఆప్‌ అవినీతిని గుర్తుకు తెచ్చుకోవాలన్న రాహుల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశ రాజధాని ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు పాల్గొనాలని ప్రధాని మోడీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఒకేరోజు బుధవారం ఓటింగ్‌ జరుగుతోంది. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని నేను ఓటర్లను కోరుతున్నాను. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్న యువతీయువకులకు శుభాకాంక్షలు. ఫస్ట్‌ ఓట్‌ దెన్‌ రీఫ్రెష్‌మెంట్‌’ అని మోడీ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ఒకే విడతలో జరగనున్న 70 శాసనసభ స్థానాలకు సాయంత్రం ఆరు వరకూ ఓటింగ్‌ జరగనుంది.ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ భాగస్వాములు కావాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ బుధవారం ఆమ్‌ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఓ పక్క స్వచ్ఛమైన రాజకీయాల గురించి మాట్లాడుతూ అతిపెద్ద కుంభకోణం ఎవరు చేశారో ఓటు వేసేటప్పుడు ఢిల్లీ ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా ప్రజల హక్కులు తిరిగి పొందుతారని, రాజ్యాంగం బలోపేతం అయ్యి ఢిల్లీ మళ్లీ ప్రగతి పథంలో పయనిస్తుందని రాహుల్‌ అన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని నిర్మాణ్‌ భవన్‌ పోలింగ్‌ కేంద్రంలో ఉదయం కాంగ్రెస్‌ నాయకుడు ఓటు వేశారు. ’నా ప్రియమైన ఢిల్లీ సోదర సోదరీమణులారా’ అని సంభోదిస్తూ రాహుల్‌ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఢిల్లీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విూరందరూ ఈరోజే వెళ్లి ఓటు వేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు విూ హక్కులను కాపాడుతుంది. రాజ్యాంగాన్ని బలోపేతం చేసి ఢిల్లీని తిరిగి పురోగతి మార్గంలో నడిపిస్తుంది. ఓటు వేసేటప్పుడు, కలుషితమైన గాలి, మురికి నీరు, చెడిపోయిన రోడ్లకు ఎవరు బాధ్యులో గుర్తుంచుకోండి. స్వచ్ఛమైన రాజకీయాలు చేయడం గురించి మాట్లాడుకుంటూ ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడిరది ఎవరు? అనేది గుర్తుంచుకోండి’ అని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 13,766 పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభం అయ్యింది.

70 నియోజకవర్గాల్లో వివిధ పార్టీల 699 మంది అభ్యర్థుల పోటీపడుతున్నారు. ఈ నేతల భవితవ్యాన్ని ఢిల్లీ ఓటర్లు తేల్చనున్నారు. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. పాలనా రికార్డు, సంక్షేమ పథకాలే ఆధారంగా వరుసగా మూడవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజధానిలో రాజకీయ ముఖచిత్రానికి కొత్త రూపురేఖలు ఇవ్వగలదని అంతా భావిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News