న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై టారిఫ్లు ప్రకటించిన ట్రంప్ .. తదుపరి మెక్సికోకు మాత్రం విరామం కల్పించారు. అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని కెనడా ప్రకటించగా, చైనా కూడా ప్రతిస్పందించనున్న నేపథ్యంలో సోమవారం అమెరికా సహా ప్రపంచవ్యాప్త స్టాక్మార్కెట్లు నష్టపోయాయి. అనిశ్చితి పరిస్థితుల్లో ఆర్థికంగా భరోసా ఇచ్చే పసిడిపైకి పెట్టుబడులు మళ్లడంతో అంతర్జాతీయ విపణిలో పుత్తడి ధర కొండెక్కింది. డాలర్ విలువ రూ.87.11కు చేరినందున, దేశీయంగా బంగారం ధర పెరుగుదల మరింత అధికంగా కనపడుతోంది.
హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) బంగారం ధర తొలిసారిగా సోమవారం రూ.86,000ను తాకింది. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) ధర 2,829.57 డాలర్లకు చేరడం ఇందుకు నేపథ్యం. అయితే తదుపరి కొంత లాభాల స్వీకరణతో రాత్రి 11.30 గంటల సమయానికి ఔన్సు బంగారం ధర 2820 డాలర్లకు దిగి రావడంతో, హైదరాబాద్ బులియన్ విపణిలోనూ రూ.85,880 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది కూడా ఇప్పటివరకు బంగారానికి గరిష్ఠస్థాయే. జనవరి 30న తొలిసారిగా 10 గ్రా.మేలిమి బంగారం ధర రూ.84,000కు, మరుసటిరోజు రూ.85,000ను తాకగా, సోమవారం రూ.86,000కు చేరడంతో కొనుగోలుదార్లు బెంబేలెత్తుతున్నారు. కిలో వెండి ధర రూ.96,400 వద్ద ఉంది.