తిరుపతి డిప్యూటీ మేయర్‌గా.. ఆర్సీ మునికృష్ణ

  • టీడీపీకి 26, వైసీపీకీ 21 ఓట్లు

అమరావతి, ఫిబ్రవరి 4: తిరుపతి డిప్యూటీ మేయర్‌గా ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 26.. వైఎస్సార్‌సీపీకి 21 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్బంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌ మాట్లాడుతూ డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో కూటమి విజయం సాధిస్తుందని నిన్ననే చెప్పామని అనుకున్నది సాధించామని అన్నారు. నిన్న తమ కార్పొరేటర్లు నలుగురిని వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకుని, కిడ్నాప్‌ చేశారని.. కిడ్నాప్‌ అయిన వారందరూ తిరిగి వచ్చేశారని తెలిపారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 26 ఓట్లతో విజయం సాధించిందన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డదారిన గెలవాలని చూశారని.. దానిని తిప్పి కొట్టామని ఆరణి శ్రీనివాస్‌ చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో ఎన్డీయే కూటమి అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక లాంఛనంగా గెలుపొందారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం మునికృష్ణ మాట్లాడుతూ.. 26 మంది సభ్యులు తనకు ఓట్లు వేసి డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

తనకు ఓట్లు వేసి గెలిపించిన కార్పొరేటర్లకు, అండగా నిలిచిన ఎమ్మెల్యేకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్థానిక మంత్రి, తనకు మద్దతు తెలిపిన ఇతర నాయకులకు మనికృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తామని, కూటమి నేతలను కలుపుకుని తిరుపతిలో ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాగా తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. సోమవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిరది. అలాగే మంగళవారం కూడా ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రశాంతంగానే ఓటింగ్‌ జరిగింది. చివరికి కూటమి అభ్యర్థి గెలుపుతో కథ సుఖాంతమైంది. 47 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌ ఆఫిషియో నెంబర్లు.. మొత్తం 50 మంది. అయితే ఓటింగ్‌లో 48 మంది పాల్గొన్నారు. ఇద్దరు అనారోగ్యంతో రాలేకపోయారు. దీంతో ఓటింగ్‌ నిర్వహంచిన ఎన్నికల అధికారి ముందు వైఎస్సార్‌సీపీ వాళ్లు చేతులెత్తాలని కోరగా 21 మంది చేతులెత్తారు. తర్వాత కూటమి నేతలు 26 మంది చేతులెత్తారు.

దీంతో.. కూటమి అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా గెలుపొందినట్లు అధికారి ప్రకటించారు. కాగా డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సోమవారం జరగాల్సి ఉంది. కోరం లేక ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఆదివారం రాత్రి నుంచి తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికపై హై డ్రామా కొనసాగింది. ఆదివారం రాత్రి టీడీపీ శిబిరంపై వైఎస్సార్‌సీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. కార్పొరేటర్‌ను వైఎస్సార్‌సీపీ నేత భూమన లాక్కెళ్లినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. కోరం 25 మంది ఉండాలి. అయితే 22 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అధికారులు ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికను మంగళవారం నాటికి వాయిదా వేశారు. దీంతో మంగళవారం గట్టి బందోబస్తు మధ్య డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించారు. మరోవైపు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. కొంతమంది కూటమిలో చేరారు. పాలనలో తమకు స్వేచ్ఛలేదని కూటమిలో చేరడంవల్ల తమకు గౌరవం పెరిగిందని కార్పొరేటర్లు అన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News