కీలక పత్రాలతో.. ఐటీ కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు మంగళవారం ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్‌ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు దిల్‌ రాజు. డాక్యుమెంట్స్‌, బ్యాంకు వివరాలతో ఐటీ కార్యాలయానికి నిర్మాత విచారణకు వచ్చారు. వారం క్రితం దిల్‌ రాజు ఇంటితో పాటు అతని కార్యాలయం, వారి కుటుంబసభ్యుల నివాసాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు వివరాలు, ఐదు సంవత్సరాల పాటు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలతో విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు ఇచ్చింది ఐటీ. ఈ నేపథ్యంలో కొన్ని పత్రాలతో పాటు ఆదాయపు చెల్లింపులపై పూర్తి స్థాయి పత్రాలతో దిల్‌రాజు విచారణకు హాజరయ్యారు.

2023 నుంచి 2025 వరకు సినీ నిర్మాణానికి సంబంధించిన పెట్టుబడులు, వచ్చిన ఆదాయాలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకురావాలంటూ ఐటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఐటీకార్యాలయానికి వచ్చిన దిల్‌రాజు విచారణను ఎదుర్కుంటున్నారు. మరో రెండు గంటల్లో విచారణ ముగియనుంది. ఐటీ విచారణ ముగిసిన తర్వాత దిల్‌ రాజు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చిన ఆదాయానికి, చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసాలు ఉన్నాయనే ఆరోపణలు, అనుమానాలతో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు సోదాలు జరిగాయి.

సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపైనా దృష్టి పెట్టారు ఐటీ అధికారులు. గత రెండేళ్లుగా దిల్‌రాజు బ్యానర్‌లో నిర్మించిన సినిమాలకు సంబంధించి కొంత సమాచారాన్ని ఐటీ అధికారులు రాబట్టారు. పెట్టిన పెట్టుబడికి, వచ్చిన ఆదాయానికి భారీ వ్యత్యాసాలు ఉండటం.. వచ్చిన ఆదాయానికి, చెల్లించిన పన్నులకు కూడా పెద్ద మొత్తంలో వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దిల్‌ రాజుతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News