సమంత ఏమన్నారంటే రోజులు మారాయి.. అన్నీ అప్డేట్ అవుతున్నాయి. మనం 2025లో ఉన్నాం. అయినా మనుషుల్లో మార్పు కనిపించడం లేదు. ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. హేళనగా చూడటం, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు సైలెంట్గా ఉంటున్నారు. ఇబ్బందుల్ని బయటకు చెప్పడం లేదు. తమలో తామే బాధ పడుతున్నారు. మనం ఎక్కడ విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నా. నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాను. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్గా నిలవండి’’ అని సమంత తన పోస్ట్లో పేర్కొన్నారు. కథానాయిక కీర్తి సురేశ్ కూడా దీనిని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ఆ బాలుడికి న్యాయం జరగాలని కోరారు. దీనికి కారణమైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనవరి 15న జరిగిన ఈ ఘటన కేరళలో తీవ్ర చర్చకు దారితీసింది. తోటి విద్యార్థుల వేధింపులు, అవమానకర చర్యలు తట్టుకోలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల ను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.