హైదరాబాద్, జనవరి 31: పాఠకుల్లో సాహిత్య అభిరుచిని పెంచి మంచి రచనలు రావడానికి దోహదం చేసే ప్రక్రియ విమర్శ అని వక్తలు అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు రూపొందించిన ‘తెలుగు సాహిత్య విమర్శ- పర్యాలోచన’ గ్రంథావిష్కరణ సభ శుక్రవారం పరిషత్తులోని డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు కళామందిరంలో జరిగింది. ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి గ్రంథాన్ని ఆవిష్కరించారు. అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ తెలుగు సాహిత్యం ఉన్నత ప్రమాణాలు సాధించడానికి దోహదపడే అనేక శిక్షణ శిబిరాలను సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్నదని అన్నారు.
ఇటీవలి కాలంలో సాహిత్య విమర్శ పై నిర్వహించిన సాహిత్య విమర్శ అధ్యయన శిబిరంలో వక్తలు చేసిన ప్రసంగాలను వ్యాసాలుగా కూర్చి ఈ పుస్తకాన్ని అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ సుజాతా రెడ్డి మాట్లాడుతూ.. తెలుగులో కందుకూరి వీరేశలింగం మొట్టమొదట విమర్శ గ్రంథం రాశారని, తర్వాతి కాలంలో కట్టమంచి రామలింగారెడ్డి వంటి వారు ముందుకు నడిపారని ఆధునిక కాలంలో అనేక ధోరణులు సాహిత్య విమర్శలో చోటుచేసుకున్నాయని తెలిపారు.
ప్రముఖ సాహితీవేత్తలు విమర్శకులు ఆచార్యులు ఎస్వీ రామారావు, మసన చెన్నప్ప,డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ వి. త్రివేణి, డాక్టర్ మారోజు దేవేంద్ర తమ ప్రసంగాలలో సాహిత్య విమర్శ చరిత్రను, వికాసాన్ని విపులంగా ప్రస్తావించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు. ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఏ. సిల్మా నాయక్ సమన్వయకర్తగా వ్యవహరించారు.