- ప్రమాదం అంచున పత్రికా స్వేచ్ఛ
- సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్
- ఫెడరేషన్ బలోపేతానికి సమిష్టిగా కృషి చేద్దాం
- వ్యవస్థాపక సభ్యుల సమావేశం పిలుపు
హైదరాబాద్, జనవరి 28: జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక సభ్యుల సమావేశం అభిప్రాయపడింది. రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు మరిన్ని గడ్డు పరిస్థితులు వస్తాయని, అందుకు జర్నలిస్టులను అప్రమత్తం చేసి పోరాటాలు చేసేందుకు ఫెడరేషన్ నాయకత్వం సిద్దం కావాలని సమావేశం పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్ లో ఏపీడబ్ల్యూజేఎఫ్-టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ రాష్ట్రస్థాయి వ్యవస్థాపక సభ్యుల సమావేశం జరిగింది. టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన వ్యవస్థాపక సభ్యులు హాజరయ్యారు. జర్నలిస్టుల హక్కులు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని, పాలకులు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా దాటవేస్తున్నారని పలువురు సీనియర్ పాత్రికేయులు ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలో కొనసాగిన గత ప్రభుత్వం జర్నలిస్టులను పూర్తిగా విస్మరించి తీరని అన్యాయం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నదని వారు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వలేక పోయిందని, రివ్యూ కమిటీ పేరుతో కాలయాపన చేస్తుందని అన్నారు. రాబోయే ఒకటి, రెండు నెలలు జర్నలిస్టులకు కీలకమని, ఎందుకంటే అక్రెడిటేషన్ కార్డులను బాగా తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోందని అన్నారు. అక్రెడిటేషన్లు తగ్గిస్తే ఊరుకోవద్దని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాలని వారన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్ స్కీం, హెల్త్ కార్డులు, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీలు, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తదితర డిమాండ్ల సాధనకై ఫెడరేషన్ ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఫెడరేషన్ బలోపేతానికి వ్యవస్థాపక సభ్యులంతా కలిసిరావాలని, ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులు సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్, ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, పిల్లి రాంచందర్, బండి విజయ్ కుమార్, వల్లాల జగన్, కోశాధికారి ఆర్. వెంకటేశ్వర్లు, యం. యాదగిరి, బీవీ శేఖర్, కే.బాపురావు, సీహెచ్ ఐలయ్య, కె. పాండురంగారావు, దామెర జగదీష్, సీహెచ్ విజయానందరావు, కె.శివప్రసాద్, శ్రీనివాస్, రాజలింగం, పి.భాస్కర్ రెడ్డి, ఎండీ యూసుఫ్, ఉమామహేశ్వర రావు, పద్మనాభరావు, రవికుమార్, కె.సుకుమార్, ఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ భవిష్యత్ కార్యాచరణ, జర్నలిస్టుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు మామి డిసోమయ్య ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులందరిని శాలువాలతో సత్కరించారు.