హైదరాబాద్, జనవరి 29: గాజులరామారంలోని చంద్రగిరి నగర్ లోని పలు కాలనీలో మంచినీళ్లు మురుగు నీళ్లులా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మురుగునీరు కలిసి వస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సరఫరా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీటిని తాగలేక ఇతరత్రా ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగపడకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మంచినీళ్లలో డ్రైనేజీ నీళ్లు కలిసి వస్తుండడంతో తీవ్ర దుర్గంధంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషితమైన నీరు తాగడం వల్ల తాము తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని, కొంతమందికి కాళ్లు కీళ్ల నొప్పులు వాంతులు విరోచనాలు కూడా అవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.