- మహాకుంభమేళాలో భారీ విషాదం
- తొక్కిసలాటలో కనీసం 20మంది మృత్యువాత
- చీకట్లో ఎటు వెళ్లాల్లో తెలియక గందరగోళంతో ఘటన
- భారీ చెత్తడబ్బాలు కూడా కారణమంటున్న సాక్షులు
- తక్షణం స్పందించిన యూపి ప్రభుత్వం
- అంబులెన్సుల్లో హుటాహుటిన క్షతగాత్రుల తరలింపు
ప్రయాగ్రాజ్, జనవరి 29: గత పక్షంరోజులుగా కోట్లాది మంది వచ్చినా..సాఫీగా సాగిన మహాకుంభమేళాలో అపశృతి చోటుచేసుకున్నది. మౌనా అమావాస్య సందర్భంగా అమృత స్నానంలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంకు చేరుకున్న వేళ తొక్కిసలాట చోటు చేసుకుంది. బుధవారం, ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 20మంది మృతిచెందారని ప్రాథమిక సమచారం. మరో 50 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్లోని స్వరూపరాణి ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. అక్కడ పోస్టు మార్టం నిర్వహించిన తరవాత మృతదేహాలను బంధువుకలు అప్పగించనున్నారు. తొక్కిసలాట వల్ల 13 అకాడాలు అమృత స్నానం రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లు ప్రకటన జారీ చేశారు. త్రివేణి సంగమంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి ఉదయం సుమారు 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు తరలింపు పక్రియ జరిగింది.
అమావాస్య రోజున స్నానం చేయాలన్న ఉద్దేశంతో.. కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. అధికారులు అంచనా ప్రకారం.. ఇప్పటికే 5 కోట్ల మంది ప్రయాగ్రాజ్ పరిసరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు సాయంత్రం వరకు ఆ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.మౌని అమావాస్య కారణంగా నెలకొన్న రద్దీతో తొక్కిసలాట ఘటన చోటుచేసుకొని పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అనేకమంది గాయపడ్డారు. ఆ భయానక క్షణాలను కొంతమంది ప్రత్యక్ష సాక్షులు విూడియాతో పంచుకున్నారు. విపరీతమైన రద్దీ వల్ల ఎటు వెళ్లాలో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొందని తెలిపారు. చీకట్లో కన్పించని చెత్త బుట్టలు కాళ్లకు తగలడంతో చాలామంది కింద పడిపోయారని పేర్కొన్నారు. ‘తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు ఒక్కసారిగా భక్తులు బయల్దేరారు. తలపై పెద్దపెద్ద లగేజీలతో భక్తులు తరలివచ్చారు.
అయితే, ఎటునుంచి వెళ్లాలి.. ఎక్కడ స్నానమాచరించాలన్న దానిపై ఎవరికీ అవగాహన లేదు. పైగా.. యాత్రికుల కోసం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇనుప చెత్త డబ్బాలను ఏర్పాటుచేశారు. చిమ్మచీకట్లో అవి ఎవరికీ కన్పించలేదు. దీంతో వాటికి తగిలి చాలామంది కింద పడిపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది‘ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. చెత్త డబ్బా తగిలి తాను కూడా కింద పడిపోయాయని, ఎలాగోలా అక్కడినుంచి కుటుంబంతో బయటపడ్డానని చెప్పారు. వేరే భక్తులను కాపాడే క్రమంలో స్వల్పంగా గాయపడినట్లు వివరించారు. మరో ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. దానివల్లే పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. చాలామంది మా కళ్ల ముందే కింద పడిపోయారని తెలిపారు. త్రివేణి సంగమానికి కిలోవిూటరు దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులంతా సంగమం ప్రధాన ఘాట్ వద్దే స్నానాలు చేసేందుకు యత్నించగా ఆ మార్గంలోని బారికేడ్లు విరిగి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
క్షతగాత్రులను వెంటనే సవిూపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే, మృతుల సంఖ్యపై యూపీ సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. తొక్కిసలాట ఘటనతో త్రివేణి సంగమం వద్ద కొంతసేపు పుణ్య స్నానాలను నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించారు. మౌని అమావాస్యను పురస్కరించుకొని భక్తులు పెద్దఎత్తున ప్రయాగ్రాజ్ కు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు దాదాపు 3 కోట్ల మంది పుణ్య స్నానమాచరించినట్లు అధికారులు తెలిపారు. 12 పూర్ణ కుంభమేళాలతో సమానమైన మహా కుంభమేళాను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. అందుకే ఈసారి భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. జనవరి 13న మొదలైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. ఇప్పటివరకు 20 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాను దర్శించుకొని పుణ్య స్నానాలు ఆచరించారు.