- అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- నల్లగొండ రైతు ధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్
నల్గొండ, జనవరి 28: సీఎం రేవంత్రెడ్డికి పాలన చాతకావడం లేదని, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అన్ని విధాలుగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నల్లగొండ జిల్లాలో రైతు ధర్నాలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పాలకులపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు గొడ్డు కారంతో అన్నం తినాల్సిన దుస్థితి ఏర్పడిరదని ఆరోపించారు. ఐటీ టవర్ కళ తప్పిందని విమర్శించారు. తన రాక సందర్భంగా నల్లగొండ ప్రజల ఆదరణ చూస్తుంటే.. తాను రైతు ధర్నాకు వచ్చినట్లు లేదని, విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్లు ఉందని అన్నారు. కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఇవాళ నల్లగొండ పట్టణంలో అడుగుపెట్టగానే మహాత్మాగాందీ యూనివర్సిటీ దగ్గర మూడు, నాలుగు వందల మంది విద్యార్థులు రోడ్డు మీదికి వచ్చిండ్రు. ‘అన్నా కేసీఆర్ పాలనలో మాకు అన్ని వసతులు ఉండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొడ్డు కారంతో అన్నం తినే దుస్థితి వచ్చింది.
ఒకసారి మీరు మా క్యాంపస్కు రావాలె’ అన్నరు. తప్పకుండా మధ్యాహ్నం రెండున్నర గంటలకు వస్త అని వాళ్లకు చెప్పి వచ్చిన. అక్కడి నుంచి బయలుదేరి ముందుకు రాంగనే కళ తప్పిన ఐటీ టవర్ కనిపించింది. వెంకట్రెడ్డి వచ్చినంక అండ్ల ఎవలన్న ఉన్నరో.. లేకుంటే తాగుబోతుల అడ్డా అయిందోగానీ, మొత్తానికైతే ఐటీ టవర్ కళ తప్పింది’ అన్నారు. ‘అక్కడి నుంచి కొంచెం ముందుకు రాంగనే.. ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఇక్కడి దాకా (రైతు ధర్నా ప్రాంగణం) జనం భారీ సంఖ్యలో కనిపించారు. దాంతో నాకు ధర్నాకు వచ్చినట్టు అనిపించలే. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యిండ్రు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చింది. మళ్లీ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు అనిపించింది. ఒక విజయోత్సవ ఊరేగింపు జరిగినట్లుగా ఉంది. భారీగా ధర్నాకు తరలివచ్చిన నల్లగొండ రైతు బిడ్డలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని కేటీఆర్ చెప్పారు.