అమెరికాలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఎత్తివేత

  • కొత్త ప్రతిపాదనలు సిద్దంచేస్తున్న ట్రంప్‌
  • దిగుమతి సుంకాలతో భర్తీ చేసుకునేలా ప్లాన్‌

వాషింగ్టన్‌, జనవరి 28: అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా సోమవారం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. దుబాయ్‌లో పన్ను రహిత విధానం ఉంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలోఉంది. ట్రంప్‌ నిర్ణయంతో ఆ మేరకు కోతపడితే.. దానిని భర్తీ చేసుకొనేందుకు దిగుమతి సుంకాలను వాడుకోవాలన్నది ప్రణాళికగా చెబుతున్నారు. ‘అమెరికన్లను ధనవంతులు, మరింత శక్తిమంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళుతున్నాం. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై పన్నులు వేసే బదులు.. మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలి. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్‌టర్నల్‌ రెవెన్యూ సర్వీసును ప్రారంభించాను‘ అని రిపబ్లికన్‌ సభ్యుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

అమెరికా చరిత్రలోనే 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదతో తులతూగారని ట్రంప్‌ పేర్కొన్నారు. నాడు సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉండేదని చెప్పారు. అప్పట్లో దిగుమతి సుంకాల నుంచి ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం లభించేందన్నారు. అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలన్నారు. అమెరికా ఉద్యోగులు, కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌, చైనా, బ్రెజిల్‌పై అత్యధిక పన్నులు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ‘బయట దేశాలు ఏం చేస్తున్నాయో చూడండి. చైనా భారీగా పన్నులు వసూలు చేస్తుంది. ఇక భారత్‌, బ్రెజిల్‌, ఇతర దేశాలు కూడా ఆ పద్ధతినే అనుసరిస్తున్నాయి. మనం అలా జరగనీయకూడదు. అమెరికా ప్రయోజనాలు అన్నింటికంటే ముందుండాలి‘ అని పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్‌ గత డిసెంబర్‌లోనే బ్రిక్స్‌ దేశాలు ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే 100శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. డాలర్‌ వినియోగం నిలిపేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News