గద్దర్ చుట్టూ కొత్త రాజకీయం మొదలయ్యింది. గద్దర్ నక్సలైట్ కనుక ఆయనక పద్మ అవార్డు ఎలా ఇస్తామన్నకేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలతో ఇప్పుడు సర్వత్రా చర్చలు.. ఉప చర్చలు.. విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. తాజాగా తెలంగాణ నుంచి ప్రముఖులు ఎవరికీ పద్మ అవార్డులు రాకపోవడం, దీనిపై సిఎం రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందించడం..తిరిగి బండి సంజయ్ విమర్శలు చేయడం తో కథ మొదలయ్యింది. నిజానికిపద్మ అవార్డులే కాదు.. ప్రతి ఒక్క విషయంపైనా ప్రజల్లో చర్చ జరగాలి. అనుయాయులకు నామినేటెడ్ రాజ్యసభ సభ్యత్వాలు, పద్మ అవార్డులు, భారతరత్నలు కూడా ఇచ్చేస్తున్నారు. అవార్డుకు ఎంపికైన వ్యక్తి అర్హుడా కాదా అన్నది చూడడం లేదు. గతంలో సచిన్ టెండుల్కర్కు భారతరత్న ఇచ్చారు. ఆయన దేశానికి ఏ రకంగా ఉపయోగ పడ్డాడో తెలియదు. తన సొంత కెరీర్, రికార్డుల కోసం మాత్రమే అతను క్రికెట్ ఆడాడు. సామాజికంగా బాధ్యతగా పెద్ద సేవలేవీ చేయలేదు. కానీ దేశానికి సేవ చేయడమే గాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థలో మూలస్తంభంగా నిలిచిన రతన్ టాటాకు మాత్రం మనం భారతరత్న ఇవ్వలేదు.
ఆయన బతికి ఉన్నప్పుడే ఇచ్చివుంటే గౌరవించుకుని ఉన్నట్లుగా ఉండేది. పివి నరసింహారావుకు భారత రత్న ఇవ్వడంలో కాంగ్రెస్ చేసిన రాజకీయం అంతా ఇంతాకాదు. దేశాన్ని నిలబెట్టిన పివిని అవమానించిన కాంగ్రెస్, చివరకు భారతరత్న ఇవ్వకుండా మరింతగా అవమానించింది. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యాంగం పేరిట రాజకీయాలు చేస్తోంది. ఇక బిజెపి కూడా సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ను రాజ్యసభకు పంపింది. అలాగే కాంగ్రెస్ తెలంగాణ నుంచి అభిషేక్ మనుసింఫ్వీుని రాజ్యసభకు పంపింది. తెలంగాణ కోసం కొట్లాడిన ఎందరినో కాదని ఓ లాయర్కు అవకాశం ఇచ్చింది. ఎవరు అధికారంలో ఉన్నా నిజాయితీ లేకుండా పోయింది. అందుకు బిజెపి మినహాయింపు కాదని చెప్పాల్సిందే. ఇవన్నీ ఇలావుంటే తాజాగా పద్మ అవార్డుల పంచాయితీ వచ్చింది. తెలంగాణలో పద్మ అవార్డుల పంచాయితీ రచ్చ చేసింది. ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ నేతలు తగ్గేదే లేదంటూ కౌంటర్లు విసురుతున్నారు.
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది.. ముమ్మాటికి వివక్షే అని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. అటు బీజేపీ మాత్రం..జాబితా పంపించినంత మాత్రాన అనర్హులకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నిస్తోంది..? ఇలా.. రిపబ్లిక్డే ముగిసినా.. తెలంగాణలో పద్మ అవార్డులపై రాజకీయ రచ్చమాత్రం చల్లారడం లేదు. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ఐదు అవార్డులు వచ్చినప్పుడు తెలంగాణకు కనీసం నాలుగు అవార్డులు కూడా ఇవ్వక పోవడం వివక్ష కాదా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నిస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వ సిఫార్సులను కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరేటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు పేర్లు.. పద్మ అవార్డుల కోసం పంపించారు. వీరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. కానీ వీరిలో ఏ ఒక్కరి పేరును కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు.. ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై కేంద్రానికి నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇందులో కనీసం చుక్కారామయ్య పేరును కూడా పరిశీలించకపోవడం, కవి అందెశ్రీ పేరును కూడా పరిశీలించకపోవడం దారుణంగానే చూడాలి. గద్దర విషయంలో కూడా బిజెపి అతిగా మాట్లాడడం మానితే మంచిది. గద్దరు ప్రజాకవి. నక్సలైట్ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అలా వచ్చిన వారిలో ప్రస్తుత మంత్రి సీతక్క కూడా ఉన్నారు. వారిని తక్కువ చేసి చూడడం, మాట్లాడడం మంచిది కాదు. పద్మ అవార్డుల విషయంలో జరిగిన వివక్ష క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. అయితే నక్సల్స్ భావజాలంతో ఎందరో బీజేపీ నేతలను చంపించిన గద్దర్లాంటి వ్యక్తులకు..పద్మ అవార్డులు ఎలా ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అలాంటి వ్యక్తులకు బరాబర్ అవార్డులు ఇవ్వమని స్పష్టం చేశారు. రాష్ట్రం ప్రభుత్వం పంపించిన పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్న బండి.. అర్హులైన వారికే పద్మ అవార్డులు వస్తాయని తేల్చిచెప్పారు.
గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాజీ నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వొచ్చు కానీ.. పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికి రారా? అని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ లాంటి వ్యక్తిని పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా అని ప్రశ్నించారు. బీజేపీ భావజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డులు ఇస్తారా?అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ప్రశ్నించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం గద్దర్ పోరాటం చేశారన్న చామల.. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఖండించారు.. బుద్దిస్ట్ విూకు మావోయిస్టుగానే కనబడ్డారా? అని ప్రశ్నించారు. గద్దర్లోని తెలంగాణ ఉద్యమకారుడు, దళిత ప్రజా ఉద్యమకారుడు కనిపించలేదా? అని నిలదీశారు. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా.. పార్టీ విధానమా చెప్పాలని డిమాండ్ చేశారు అద్దంకి. అయితే.. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.
భావజాలం వేరు మావోయిస్టుగా చేయడం వేరన్న బండి.. మావోయిస్టులతో ఈటలకు సంబంధం లేదని చెప్పారు. ప్రభుత్వం ఇస్తామంటున్న గద్దర్ అవార్డులను బీజేపీ వాళ్లు తీసుకోరని స్పష్టం చేశారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో సత్సంబంధాలు ఉన్న వారికే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిరంజీవికి ఇస్తే, ఇప్పుడు బీజేపీ బాలకృష్ణకి ఇచ్చిందని విమర్శించారు. గద్దర్కు, ఎల్టీటీఈకి పెద్దతేడా లేదంటూ మరో బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలపై ఇప్పటికే మండిపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా యూజీసీ, పద్మ అవార్డుల అంశంలోనూ మోదీ సర్కారు తీరును తప్పుబడుతోంది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే అవార్డుల ఎంపిక ఖచ్చితంగ ఆపారదర్శకంగానే సాగాలి. అర్హులకే అవార్డులు కానీ, రాజ్యసభ సభ్యత్వాలు కానీ దక్కాలి. బిజెపి ఈ విసయంలో పారదర్శకంగా పనిచేస్తే మంచిది