హైదరాబాద్, జనవరి 25: ఉత్తమ పరిశోధకుడు, కవి, తెలుగు భాషా సాహిత్య రంగాల వికాసానికి డా.ఎల్లూరి శివారెడ్డి చేసిన సేవలు ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు. రసమయి సాహిత్య, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తెలంగాణ సారస్వత పరిషత్తు లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి రచించిన మనసు పూచిన పూలు కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.శివారెడ్డి తమ కావ్యాన్ని పద్మభూషణ్ డాక్టర్ కే ఐ వరప్రసాద్ రెడ్డి, వసంత దంపతులకు అంకితం చేసి ఘనంగా సత్కరించారు.శివారెడ్డి సురవరం ప్రతాపరెడ్డి వాంగ్మయ కృషిని గురించి విశేషమైన పరిశోధన చేసి ప్రామాణికమైన గ్రంథం రచించారని డాక్టర్ జి. చిన్నారెడ్డి తమ ప్రసంగంలో తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి గొప్ప విద్యావేత్తగా, సాహిత్య వేత్తగా ఎదిగిన ఘనత శివారెడ్డికి దక్కుతుందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అధ్యక్షోపన్యాసం చేస్తూ అధ్యాపకులుగా తాను రసాయన శాస్త్రంలో, శివారెడ్డి తెలుగు భాషా సాహిత్య శాఖలో పనిచేశామని తర్వాత ఆయన పర్యవేక్షణలో తాను పిహెచ్డి పరిశోధన చేశానని ఆవిధంగా తనకు ఆయనతో గురువుగా ఎంతో అనుబంధం ఉందని అన్నారు. విశిష్ట అతిథులుగా డాక్టర్ ఓలేటి పార్వతీశం,డాక్టర్ మర్రి వెంకట నరసింహ రెడ్డి, డాక్టర్ జె చెన్నయ్య ప్రసంగించారు. రసమయి ఎం.కె రాము స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో కవి రచయితలు పాల్గొని శాలువాలతో శివారెడ్డిని అభినందించారు.