ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం ఓ ప్రహసనంగా సాగుతోంది. దేశ ఓటర్లలో చైతన్యం కలిగించండంలో.. పక్కాగా ఆధార్ తరహాలో ఓటరు కార్డు అందించడంలో… కచ్చితంగా పౌరులంతా ఓట్లు వేసేలా చర్యలు తీసుకోవడంలో.. ఎన్నికల సంఘం విఫలం అవుతూనే ఉంది. ఒక్క శేషన్ కాలంలో తప్ప ఎప్పుడు కూడా ఎన్నికల సంఘం పటిష్టంగా పనిచేయలేకపోయింది. ఎన్నికల సంఘం ఉందన్న బయం లేకుండా పోయింది. ఓట్లు నమోదు చేసుకోవడం మొదలు, ఓట్లను నిలబెట్టుకోవడం, అడ్రస్ మార్పించుకోవడం వంటివన్నీ ఓ ప్రహసనంగా మారాయి. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రభుత్వం ఏర్పడడానికి ఓటే ఆయుధం. కానీ ఆ ఓటు బలంగా, నిర్భయంగా వేయగలిగేలా చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల్లో 40, 50 శాతం మించి ఓట్లు నమోదు కావడం లేదు. ఓటేయకున్నా ఫర్వాలేదన్న వాదన బలపడి పోయింది. ఓటేయకుంటే క్రమశిక్షణా చర్యలు లేవు. దేశంలో పక్కాగా ఓటు నమోదు..పక్కాగా ఓటరు కార్డు, ఓటేయకపోతే చర్యలు వంటివి ఉండాల్సిందే. అప్పుడే జాతీయ ఓటరు దినోత్సవానికి అర్థం ఉంటుంది.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్న ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి 25న భారతదేశం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1950లో భారత ఎన్నికల సంఘం స్థాపించిన రోజును గుర్తు చేసుకుంటూ కేంద్రం ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు, ఓటింగ్ ప్రాముఖ్యత తెలియజేసేందుకు 2011 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో వారిని ఓటింగ్ వైపు పోత్సహించేలా ఏటా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ’నైథింగ్ లైక్ ఓట్.. ఐ ఓట్ ఫర్ ష్యూర్’ థీమ్తో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఓటేయకుండా ఉంటున్న వారిలో అత్యధిక శాతం యువతే అని గుర్తించాలి. దేశంలో యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు 2011లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. చాలా మంది అర్హత గల యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడం లేదని అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ సమస్యను అధిగమించేందుకు చొరవ చూపింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం.. యువతను ఓటర్లుగా నమోదు చేయించడం, వారికి ఓటర్ గుర్తింపు కార్డులు మంజూరు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అమలు లోకి వచ్చిన రోజును ఒక ప్రత్యేక దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దానికి జాతీయ ఓటర్ల దినోత్సవంగా నామకరణం చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 25న వేడుకగా ఈరోజును క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అయితే ప్రజల్లో నిర్లిప్తతత, రాజకీయాల ప్రమేయం వంటివన్నీ దీనిని నీరుగారుస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవడం జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన ఉద్దేశం. అందు కోసం ఈ రోజున వారికి ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, 18సంవత్సరాలు నిండిన యవతను ఓటర్లుగా నమోదు చేయిస్తుంటారు. అలాగే ఎన్నికల పక్రియలో వారంతా చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం ఓటర్ల దినోత్సవ ప్రధాన లక్ష్యం.
మొదటిసారి ఓటర్గా నమోదు చేసుకునే వారికి సహాయం చేయడం, నూతన ఓటర్ గుర్తింపు కార్డులు అందించడం వంటి పనులు అధికారులు చేస్తుంటారు. అలాగే ఓటింగ్ ప్రాముఖ్యత తెలియజేసేలా బహిరంగ ర్యాలీలు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఓటింగ్ పక్రియ, ఓటు ప్రభావం గురించి అవగాహన కల్పించే ప్రచారాలు చేస్తున్నారు. అలాగే అక్షరాస్యతను ప్రోత్సహించడంలోనూ జాతీయ ఓటర్ల దినోత్సవం కీలక పాత్ర పోషిస్తోంది. ‘ప్రతి ఓటు లెక్కించబడుతుంది. విూ స్వంత ప్రజాస్వామ్యంలో ప్రేక్షకుడిగా ఉండకండి. విూ ఓటు హక్కును వినియోగించుకోండని జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుల్లెట్ కన్నా బ్యాలెట్ బలమైనది. ‘ఓటు విలువైనది. ఇది అత్యంత పవిత్రమైనది. ప్రజాస్వామ్యంలో మనకు ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం ఓటు అన్న విషయాన్ని ఏటేటా గుర్తు చేస్తున్నా..భారతీయ ఓటర్లలో నిర్లిప్తత తొలగించలేకపోతున్నాం.
ఓ మంచి నేతను ఎన్నుకో వాలంటే ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిది. అందుకే ప్రజలు కూడా ఓటు విలువ తెలుసుకోవాలి. లేకుంటే ఎవరో కొందరు ఎన్నికవుతూ..మనవిూద స్వారీ చేస్తుంటారు. మనం ఓటు వేయ కున్నా పాలకులుగా ఉంటారు. ఇదిలావుంటే ఎన్నికల సంఘం అధికార పార్టీకి కీలుబొమ్మగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం పనితీరుపై భాజపా, కాంగ్రెస్ల మధ్య పోస్ట్ల వార్ నడిచింది. ఈసీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా.. కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. నిజానికి ఎవరు అధికారంలో ఉన్నా ఇసి పనిచేసుకునేలా చేయడం లేదు. వేలుపెట్టడం ఎక్కువైంది. జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది శక్తిమంతమైన మన ప్రజాస్వామ్యానికి గుర్తు. ఇది ప్రతి పౌరుడికి తన ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది. మన భవిష్యత్తుకు ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విషయంలో ఎన్నికల సంఘం పనితీరును మెరుగు పర్చుకుని స్వతంత్రంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
పోలింగ్ పక్రియను ఆధునికీకరించడంతో పాటు ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా, ఓటు నమోదును పద్దతిగా చేసేలా ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఈసీ కృషి చేయాల్సి ఉంది. అయితే గత పదేళ్లుగా భారత ఎన్నికల సంఘం పనితీరు క్షీణించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. మన ఎన్నికల పక్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకొని, ఆదర్శంగా నిలిచిందనే చెప్పాలి. ప్రతి పౌరుడికి ఓటుహక్కు అనేది పట్టణస్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు విస్తరించింది. మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మన సంస్థల స్వతంత్రతను కాపాడుకోవడం ముఖ్యం. అందుకు మరింతగా ఇసి బలోపేతం కావాల్సిన అవసరం ఉంది.