ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ రద్దు

అమరావతి, జనవరి 23: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరస్వతీ పవర్‌ ప్లాంట్‌కు కేటాయించిన అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. సరస్వతీ భూముల్లో అసైన్డ్‌ ల్యాండ్స్‌ ఉన్నాయన్న అధికారుల నివేదికతో చర్యలు చేపట్టింది. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతీ పవర్‌ ఇండస్ట్రీస్‌ భూముల రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్‌ చేసింది. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాల అసైన్డ్‌ భూమి రిజిస్ట్రేషన్‌ను కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశాలతో అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ సురేశ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ భూములు వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, పల్నాడు జిల్లా జగన్‌ కుటుంబానికి సరస్వతీ పవర్‌ ఇండస్ట్రీస్‌ భూములు కేటాయించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో 1,516 ఎకరాల భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలు రైతుల నుంచి సరస్వతీ పవర్‌ ప్లాంట్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది.

అయితే, అప్పటి నుంచి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదని స్థానికులు ఆరోపించారు. ఇదే భూముల్లో అటవీ శాఖ భూములు కూడా ఉన్నాయన్న వివాదంతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సైతం పర్యటించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం సదరు భూముల్లో పూర్తి స్థాయి సర్వే చేపట్టింది. గత నవంబరులో అసైన్డ్‌ ల్యాండ్స్‌కు సంబంధించిన వ్యవహారంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగానే వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములు రద్దు కోరుతూ నివేదిక ఇవ్వడంతో సరస్వతి పవర్‌ ప్లాంట్స్‌ భూమిలోని అసైన్డ్‌ ల్యాండ్స్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News