- త్వరలో గ్రేటర్లో కలవనున్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు
హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ మహా నగరం విశ్వ నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని టాప్ సిటీల్లో హైదరాబాద్ కూడా ఒకటిగా నిలుస్తోంది. లండన్, న్యూయార్క్ వంటి ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ట్రైసిటీలు ఉండగా.. నగర విస్తరణలో భాగంగా ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీని కూడా నిర్మిస్తున్నారు. దాదాపు 20 వేల ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుంది. ఇక నగర విస్తరణలో భాగంగా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని పెంచాలని భావిస్తోంది. ఔటర్ రింగు రోడ్డు వరకూ జీహెచ్ఎంసీని విస్తరణపై దృష్టిపెట్టింది.
20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లనను గ్రేటర్లో కలపాలని భావిస్తోంది. ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమచారం. జీహెచ్ఎంసీ కాకుండా ఓఆర్ఆర్ లోపల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పోలిస్తే అభివృద్ధిలో ఇవి వెనుకబడ్డాయి. నగరం వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఓఆర్ఆర్ వరకూ ఒకేవిధంగా అభివృద్ధి చేసేందుకు వాటిని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.