జిఎస్టీ.. రిజిస్టేష్రన్‌ ఛార్జీల మోతతో కుదేలు

  • ఇంటికలను దెబ్బతీస్తున్న ప్రభుత్వాలు
  • ధరల ప్రభావంతో అమాంతంగా పెరుగుదల

హైదరాబాద్‌, జనవరి 23: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఊరూవాడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఏడాదైనా దీనికి సంబంధించి పక్కా కార్యాచరణ జరగేలదు. గ్రామాల్లో మాత్రం కాంగ్రెస్‌ నేతలు ఊదరగొడుతున్నారు. పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా ఎంతమందికి ఇందరమ్మ ఇళ్లు కట్టిస్తారు. మిగతా పేదవారి పరిస్తితి ఏంటన్నది పాలకులు ఆలోచించడం లేదు. ప్రజలపై రకరకాల పన్నులతో పీల్చి పిప్పి చేస్తున్నారు. ఒకప్పుడు మధ్యతరగతి వారు సునాయాసంగా ఓ ఫ్లాట్‌ కొనుక్కోగలిగేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. హైదరాబాద్‌ లాంటి నగరంలో కోటిన్నర లేనిదే ఓ అపార్ట్‌మెంట్‌ రావడం లేదంటే ఇది అభివృద్ది అవుతుందా.. లేక సామాన్యులకు ఇల్లు అందుబాటులో లేకపోవడమా అన్నది ఆలోచన చేయాలి. ఇందులో జిఎస్టీ పదినుంచి 12 లక్షలు, రిజస్టేష్రన్‌కు ఓ పది నుంచి 12 లక్షలు కట్టాలంటే ఎంత భారం పడుతుందో ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. తెలంగాణలో రుణం తీసుకుంటే.. అదనంగా ప్రభుత్వానికి మరో 50వేలు అప్పనంగా చెల్లించాల్సి వస్తోంది.

ఇలాంటి అడ్డగోలు విధానాలను ప్రభుత్వాలు సవిూక్షించాలి. సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నాం అన్న పదాలు వినడానికి బాగానే ఉంటాయి. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయని చంకలు గుద్దుకోవడంతో సరిపుచ్చితే మార్పు రాదు. పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ట్యాక్స్‌ చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పొదుపులు, పెట్టుబడులకు భద్రత ఏర్పడిందని అంటున్నారు. నిజానికి ఇదొక్కటే దేశాన్ని, ప్రజలను అగాధంలోకి నెట్టుతోందని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందన్న మాటలు శుద్ద అబద్దం. ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ప్రజలకు ఉపాధి లభించేలా ప్రజా ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించాల్సి ఉంది. బ్యాంకులను సంస్కరించాల్సిన అవసరం ఉంది. రుణాలు పొందేవారిపై వడ్డీల భారం పెరుగుతోంది. జిఎస్టీ వల్ల మరింత భారం పడుతోంది.

దీనికితోడు ఇల్లు కొనాలనుకుంటున్న వారిపై రాష్ట్రంలో కూడా పన్నులు, రిజిస్టేష్రన్‌ ఛార్జీలు పడుతున్నాయి. వీటికి తోడు స్టీలు, సిమెంట్‌, లేబర్‌ ఛార్జీలు, ఇతరత్రా మెటీరియల్‌ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇవన్నీ సవిూక్షించాలి. అప్పడే మధ్యతరగతి వారు సొంతంగా ఇల్లు కొనుక్కోగలరు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News