హైదరాబాద్, జనవరి 22: నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కల్తీ, అపరిశుభ్ర ఆహార పదార్థాలు తయారీ చేసి ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూకట్ పల్లి జోన్ పరిధిలోని కుతుబుల్లాపూర్ సర్కిల్ సూరారం ప్రాంతంలో గల పలు పిండి వంటల, స్వీట్ తయారి కేంద్రాలను ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా మేయర్ ఆయా షాప్లో తయారు చేసి అమ్మకానికి ఉన్న నాణ్యతలేని సరుకులను, అపరిశుభ్ర వాతావరణములో తయారు చేస్తున్న పిండి వంటకాలు, ఆహార పదార్థాల తయారీలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడాన్ని గుర్తించారు. పిండి, పప్పులు, తదితర సరుకుల పై తయారు తేదీ, ఎక్స్పైరీ తేదీ లేకపోవడాన్ని గమనించి, నిల్వలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘనల పై ప్రశ్నించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, కాలపరిమితి ముగిసిన సరుకులు నిల్వ చేయడం వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యతని అన్నారు. నాణ్యతలేని ఆహార పదార్థాలు కొని తింటూ పిల్లలు, పెద్దలు ఫుడ్ పాయిజనింగ్ కు, అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు బయటి ఫుడ్ తినేటప్పుడు ఆలోచించాలని సూచించారు. నాణ్యతలేని సరుకుల అమ్మకంపై జిహెచ్ఎంసి కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాల అమ్మకాన్ని నిరోధించేందుకు ఈ తనిఖీలు కొనసాగుతాయని మేయర్ తెలిపారు. ఇలాంటి వస్తువులు వినియోగించుకునే సందర్భంలో ప్రజలు ఆలోచించాలన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆలోచన చేయాలన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ హెల్త్ పంకజ, జిహెచ్ఎంసి ఫుడ్ సహాయ కంట్రోల్ ముత్యం రాజు, ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మి కాంతం, చీఫ్ సిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు.