- దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులా
- ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, జనవరి 22: రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండాపోతుందని, కాంగ్రెస్ గూండాలు హద్దులు దాటుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో దివ్యాంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుండగులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్కు భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదని.. ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ఓ ప్రభుత్వ ఆఫీసులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. దాడి చేసింది మంత్రి గూండాలు అయితే.. పోలీసులు భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించిన తమ నేతను అరెస్ట్ చేసి.. దాడి చేసిన వారిమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరని మండిపడ్డారు. తమ నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి మీద జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నానన్నారు.
బాధ్యులపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీని కోరుతున్నానని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు ఇదిలాఉండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ తలసాని శ్రీనివాసరావు ఇంట్లో సమావేశమయ్యారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో కంచెలు వేసి కాపాడిన ప్రభుత్వ పార్కులకు కాంగ్రెస్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డికి పాలన చేతకాదనే నిజాన్నిహైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కట్టడాలు, నిర్మాణాల నిర్వహణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని ఈ ప్రభుత్వానికి సోయి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.