హైదరాబాద్, జనవరి 22: నగరంలోని పాతబస్తీలో మహ్మద్ ఫారూఖ్ అనే వ్యక్తి ఏకంగా 110 అలెగ్జాండ్రిన్ చిలుకలను అమ్ముతూ పట్టుబడ్డాడు. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ చిలుకలు చాలా వరకు తగ్గిపోయాయి. అరుదుగా కనపడుతుంటాయి. ఇక హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో తప్ప ఆసలు కనపడడం లేదు. ఈ క్రమంలోనే పాతబస్తీలో మహ్మద్ ఫారూఖ్ అనే వ్యక్తి ఏకంగా 110 అలెగ్జాండ్రిన్ చిలుకలను అమ్మడం తీవ్ర కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫారూఖ్ ని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 110 అలెగ్జాండ్రిన్ చిలుకలను అటవీ అధికారులు జూపార్కుకు తరలించారు. ఈ ఘటనపై తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియల్ మాట్లాడుతూ.. అలెగ్జాండ్రిన్ చిలుకలను అక్రమంగా అమ్ముతున్న మహ్మద్ ఫారూఖ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వన్యప్రాణి చట్టం ప్రకారం చిలుకలను వేటాడటం నేరం అని హెచ్చరించారు.
