- పక్కాగా తెలంగాణ భూ భారతి అమలు
- అధికారులతో సవిూక్షలో సిఎస్ శాంతికుమారి
హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, తెలంగాణ భూ భారతి చట్టంలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని సిఎస్ శాంతికుమారి అన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు కార్యాచరణ చేయాలన్నారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, తెలంగాణ భూ భారతి చట్టం, 2025 పై మంగళవారం సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వర్క్ షాప్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, తెలంగాణ భూ భారతి చట్టం, 2025 వివరించేందుకే ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ భూ భారతి చట్టం, 2025పై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నవీన్ మిట్టల్ మాట్లాడుతూ రెవెన్యూ పరిపాలనను క్రమబద్ధీకరించడంతో పాటు జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సమగ్ర భూసంస్కరణలు తీసుకురావడమే ప్రభుత్వ విజన్ అని అన్నారు.
ఈ చట్టం సమర్థవంత మైన వ్యవసాయ భూ పరిపాలన విధానాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 19 రాష్టాల్లో అనుసరిస్తున్న రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని అనుసరించి 2024 జూలై 1న ముసాయిదా చట్టాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రజల నుండి వచ్చిన పలు సూచనలను స్వీకరించిన తరువాతే ఈ చట్టంను రూపొందించామని ఆయన తెలియజేశారు. శాసనసభ ఆమోదం పొందిన ఈ చట్టాన్ని గౌరవనీయులైన గవర్నర్ కూడా ఆమోదించడంతో ఈ నెల 4న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిరదన్నారు. యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ను తయారు చేయడంతో పాటు అవసరమైన నియమ, నిబంధనలను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ -2025 ద్వారా రాష్టాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ఉద్దేశించిన ముఖ్యాంశాలను వివరించారు.
సోలార్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రోత్సాహకాలను అందించడం ద్వారా, రాష్ట్ర వినియోగదారులకు స్వచ్ఛమైన, విశ్వసనీయమైన,సరసమైన విద్యుత్ను అందించడానికి కృషి చేస్తూ, రాష్టాన్రికి ఇంధన భద్రతను నిర్దారించడం ఈ విధానం లక్ష్యం అన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రవిగుప్తా, వికాస్రాజ్, సబ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు దానకిషోర్, రిజ్వీ, క్రిస్టినా జోంగ్తు, కార్యదర్శులు లోకేష్ కుమార్, యోగితా రాణా, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ హరీశ్, ఇతర అధికారులు వర్క్ షాప్కు హాజరయ్యారు.