- విజయవాడలో 15న ’యుఫోరియా మ్యూజికల్ నైట్’
- ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి
అమరావతి, జనవరి 21: తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ’యుఫోరియా మ్యూజికల్ నైట్’ నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కూడా ఆహ్వానిస్తామని నారా భువనేశ్వరి తెలిపారు. ‘ఎన్టీఆర్ కష్టపడి పైకి వచ్చారు. రాజకీయ రంగంలో ఏవిూ ఆశించకుండా ప్రజల కోసం ముందుకు నడిచారు. పేదల కోసం ఎన్నో పథకాలు తెచ్చారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు వంటివి ఆయన తెచ్చినవే. ప్రజా నాయకుడు చంద్రబాబు.. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించారు.
ఏ ప్రభుత్వ సహాయం తీసుకోకుండా ముందుకు సాగుతున్నాం. ఫైలిన్, హుద్ హుద్, కేరళలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మందికి సాయమందించాం. తలసేమియా బారిన పడిన వారికి సహాయం చేసేందుకు బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాం. కొందరికి రక్తదానం అంటే భయం, మరి కొందరికి ఇష్టం ఉండదు. బడ్ల్ డొనేషన్ సమాజానికి ఎంతో మంచి చేస్తుంది. ప్రతి రక్తపు చుక్క ప్రజల ప్రాణాలను కాపాడుతుంది. మేము అడిగిన వెంటనే మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు తమన్ అంగీకరించారు. కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నా. బుక్ మై షోలో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. విూరు కొన్న టికెట్స్ డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం‘ అని భువనేశ్వరి తెలిపారు.