- ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో చాలామంది జైలుకు
- రెడ్బుక్ తనపని తాను చేసుకుంటోంది
- చంద్రగిరి ముఖ్య నేతలతో లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతి, జనవరి 15: రెడ్బుక్ మేరకు అక్రమార్కులపై చర్యలు తప్పవని పండుగ వేళ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది త్వరలోనే జైలుకు వెళ్తారని నారా లోకేష్ సంచలన కామెంటగ్స్ చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని ఉద్ఘాటించారు మంత్రి. రెడ్ బుక్ను మర్చిపోలేదని, తన పని చేసుకుపోతోందని వ్యాఖ్యానించారు. బుధవారం నాడు చంద్రగిరి ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మంత్రి లోకేష్.. త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తా మన్నారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఫీడ్ బ్యాక్ తీసుకుని కష్టపడిన వారికి గుర్తింపునిస్తామన్నారు. ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామన్నారు. పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తానని లోకేష్ చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గం నారావారిప్లలెలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్.. ఇలా తన చుట్టూ తిరగడం వల్ల పదవులు రావని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు. టర్మ్ లిమిట్స్ ఉండాలన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను 3వసారి కొనసాగుతున్నానని లోకేష్ గుర్తు చేశారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. పొలిట్ బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30శాతం కొత్తవారు రావాలని.. అప్పుడే పార్టీలో మూమెంట్ వస్తుందన్నారు. అహర్నిశలు పాటుపడ్డవారికే గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చామని లోకేష్ తెలిపారు. ఫీల్డ్లో ఏం జరుగుతుందో ఎప్పటిప్పుడు తెలుసుకుం టామన్నారు. 994 తర్వాత టిడిపి గెలవని నియోజకవర్గం చంద్రగిరి అని.. ఈ సారి మాత్రం భారీ మెజారిటీతో గెలిచామని పార్టీ శ్రేణులను అభినందించారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వంలో ప్రజలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారన్నారు.
యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలను విజయవంతం చేశారన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి ఎన్నడూ లేని విధంగా 164 సీట్లు ఇచ్చారన్నారు. భారీ మెజారిటీతో గెలిచాం కదా అని తప్పులు చేయొద్దని పార్టీ కేడర్కు లోకేష్ హితవు చెప్పారు. ’మనమంతా ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలి. ప్రజలు ఆశతో మనవైపు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ’యువగళంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు. తప్పు చేసిన ఎవరినీ వదలే ప్రసక్తిలేదు. అనవసరంగా కేసులు పెట్టడం మన విధానం కాదు. సోషల్ విూడియా చూసి విూరు కంగారుపడి నన్ను కంగారుపెట్టొద్దు. తిరుపతి పార్లమెంటు పరిధిలో దొంగఓట్ల వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టం. ఫిబ్రవరి నుంచి స్వర్ణాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో పార్టీ కేడర్ అంతా భాగస్వాములు కావాలి. మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి. కూటమి ప్రభుత్వంలో మనది పెద్దన్న పాత్ర, మిత్రధర్మంతో పనిచేస్తున్నాం. కొంతమంది ఆవేశంతో మాట్లాడినా ఓర్పుగా ఉండాలి. ఆవేశపడితే రాష్ట్రం, ప్రజలు నష్టపోతారు.
ఈ అయిదేళ్లు ఓపికగా, సంయమనంతో రాష్టాన్ని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులు భర్తీచేస్తాం. ఎఎంసిలను కూడా త్వరలో నియమిస్తాం. సీనియర్లు, జూనియర్లను సమానంగా ప్రోత్సహిస్తాం. పనిచేసేవాళ్లను గౌరవిస్తాం. గతంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, సభత్వనమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న కేడర్కు గుర్తింపునిస్తాం.’ అని పార్టీ శ్రేణులకు మంత్రి లోకేష్ చెప్పారు.