70 ఏళ్ల వృద్ధ రైతు దీక్షకు.. 111 మంది రైతులు మద్దతు

న్యూఢిల్లీ, జనవరి 15: పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ పంజాబీ రైతు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌.. గత 50 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. హర్యానాలోని ఖనౌరి బోర్డర్‌ సమీపంలో ఆ 70 ఏళ్ల వృద్ధ్ధ రైతు దీక్ష చేస్తున్నాడు. ఆ రైతుకు తోడుగా ఇప్పుడు మరో 111 మంది పంజాబీ రైతులు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. నల్ల దుస్తులు ధరించి ఇవాళ నిరసనకు దిగారు. రైతుల చేపడుతున్న ఆమరణ దీక్షను అడ్డుకునేందుకు హర్యానా బోర్డర్‌ సమీపంలో భారీగా పోలీసుల్ని మోహరించారు. దల్లేవాల్‌ ఆమరణ దీక్ష నేటితో 51వ రోజుకు చేరుకున్నది. ఆయన కేవలం నీళ్లు సేవిస్తూ ఇన్నాళ్లు గడిపారు. ఇప్పుడు నీళ్లు తాగడం కూడా ఇబ్బందిగా మారినట్లు పంజాబీ రైతులు పేర్కొన్నారు. అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

దల్లేవాల్‌ ఏమీ తినడం లేదని ఇటీవల రైతులు తెలిపారు. సీనియర్‌ రైతు దల్లేవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు డాక్టర్లుచెప్పారు. అతని కీటోన్‌ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. మజిల్‌ మాస్‌ కూడా పడిపోయినట్లు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి 111 మంది రైతులు కొత్తగా ఆమరణ దీక్షకు దిగినట్లు రైతు నేత అభిమన్యు కోహర్‌ తెలిపారు. దల్లేవాల్‌ కన్నా ముందే తమ ప్రాణాలు బలి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ రైతులు చెప్పారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News