గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియార అద్వానీ జంటగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్తో ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా వచ్చి వారం కూడా కాకుండానే లోకల్ ఛానల్లో ప్రసారం అయ్యింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను నెటిజన్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్ (ఎస్కేఎన్) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంటుందని తెలిపారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక సినిమా విడుదలై 4 నుంచి 5 రోజులు కాకుండానే లోకల్ కేబుల్ ఛానల్తో పాటు బస్సుల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ విషయం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. సినిమా అంటే కేవలం దర్శకుడు, హీరో, నిర్మాతలే కాదు.
ఇది నాలుగేండ్ల కృషి. ఇలా ఆన్లైన్ పైరసీ చేస్తున్నప్పుడు సినిమా విజయంపై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి ఆలోచించండి. ఇలా చేయడం వలన చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు కూడా ముప్పు ఉంటుంది. ఈ చర్యలపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునే టైం వచ్చింది. సినిమాను కాపాడడానికి, భరోసానివ్వడానికి అందరం కలిసి పని చేద్దాం అని ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాపై స్పందిస్తూ.. ప్రేక్షకులందరీకి మా చిత్రయూనిట్ తరపున ఒకటే విన్నపం. మా సినిమాను థియేటర్లోనే చూడండి. బస్సుల్లో కానీ.. లోకల్ ఛానల్లో కానీ చూసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. అంటూ దిల్ రాజు చెప్పుకోచ్చాడు.