భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి స్వామి వివేకానంది. ఆయన ఎప్పుడూ యువతను మేల్కొల్పుతూనే ఉంటారు. ముఖ్యంగా యువతకోసం ఆయన ఎంతో తపించారు. భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని. యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు. అందుకే ’డబ్బు లేని వాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేని వాడు అసలైన పేదవాడు అంటారు’వివేకానంద. ఆయన ఎప్పుడు కూడా ’గొర్రెలలా కాదు సింహంలా ధైరంగా బ్రతకమని’ దేనికి భయపడవద్దని అంటారు. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను‘ అని స్వావిూజీ తరచూ అనేవారు. మన దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపినవారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజు జనవరి 12 ను ’నేషనల్ యూత్ డే’ గా జరుపుకుంటారు.
ఆయన తన ప్రసంగాలతో, సూక్తులతో పుస్తకాలతో, యువతరాన్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు. జీవితం నిరాశ నిస్పృహలతో నిండిపోయినప్పుడు, భయ భ్రాంతులకు గురైనపుడు, మనసు చెడు మార్గాలవైపు మళ్ళి ఏమిచెయ్యాలో దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నపుడు ఒక్కసారి స్వామి వివేకానందకి సంబందించిన పుస్తకాలు, సూక్తులను చదవండి. వివేకానందుడి సందేశాలు సూటిగా మన హృదయాన్ని తాకుతాయి. మనసులో ఒక తెలియని ధైర్యం, ఆలోచనలో మార్పు కలుగు తుంది. జీవితానికి అసలైన అర్ధం తెలుస్తుంది. నిద్రాణమై ఉన్న భారత జాతిని మేల్కొలిపిన ఆ మహనీయుడు, యుగ పురుషుడు ఎప్పటికి మన గుండెల్లో నిలిచే ఉంటారు. అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేయడం ద్వారా భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద. యువత తమ తెలివితేటలతో ఆధునిక భారత నిర్మాణానికి పూనుకోవడం ద్వారానే ఆయనకు నివాళి అర్పించగలదు..
భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్దాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఆయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారత దేశం వచ్చిన వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ఇంతటి ఘనత సాధించిన స్వామి వివేకానంద కేవలం ముప్ఫై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ’జాతీయ యువజన దినోత్సవం’గా ప్రకటించింది. వివేకానందుడు తన సందేశంలో భారతదేశ మత సామరస్యాన్ని గురించి, వైవిధ్యాన్ని గురించి వివరించాడు.
ప్రాచీన కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాడులు ఎదుర్కొన్న నుంచి ఇజ్రాయెలీలు, పార్సీలు వంటివారిని స్వీకరించి హృదయాలకు హత్తుకున్న భారతదేశానికి చెందినవాడినని గర్విస్తున్నానన్నాడు. వివిధ మార్గాల ద్వారా సాగిన మానవులంతా భగవంతుణ్ణి చేరుకుంటారని చెప్పే హిందూ సూక్తులను, భగవద్గీత శ్లోకాన్ని ప్రస్తావించాడు. చారిత్రకంగా ఎన్నో నాగరికతలు, దేశాలను నాశనం చేసిన మూఢభక్తి, మతతత్వాలను సర్వమత సమ్మేళనం దూరం చేస్తుందని విశ్వసిస్తున్నట్టు చెప్పాడు. తరవాత రామకృష్ణ పరమహంస సాహచర్యలో జీవితం గడిపాడు. రామకృష్ణ పరమహంస నుంచి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలోకి నడిచాడు. కుటుంబ కష్టాలను ఈడుస్తున్న సమయంలోనే 1886లో రామకృష్ణ పరమహంస మరణించారు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఉండేవారు. వాళ్ళకి నరేంద్రుడు నాయకుడిగా ఉండేవారు.
కొంతకాలం తరువాత వివేకానంద దేశమంతటా పర్యటించాలనుకున్నారు. భారతదేశమంతటా ప్రయాణించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూసారు.ఆ సమయంలో పేదవాళ్ళ పరిస్థితి చూసి చలించి పోయారు. భారత దేశం బానిసత్వంలో మగ్గిపోవడానికి, మూఢనమ్మకాలే కారణమని గుర్తించారు. భారతదేశంలోని వివిధ మతాలను వాటి తత్వాలలను అర్ధం చేసుకున్నారు. భారతీయ ఆద్యాత్మిక సందేశాన్ని ఇతర దేశాలకు అందించాలనుకున్నారు. అలా దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ సముద్రంలో కొంత దూరంలో కనపడుతున్న ఒక చిన్న కొండ లాంటి ప్రదేశానికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ మూడు రోజుల పాటు ధ్యానం చేసారు. ఆ ధ్యానంలో తాను ఇన్ని రోజుల నుండి చుసిన వాటిని స్పృష్టంగా అర్ధం చేసుకున్నారు. పాశాత్య దేశాలకు వెళ్లి భారతదేశపు గొప్పతన్నాని చాటాలని అలాగే తిరిగి వచ్చిన తరువాత నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొలపాలని నిర్ణయించు కున్నారు.
అయితే చికాగో లో జరగబోయే సర్వమత మహా సభలకు వెళ్లాలని, అక్కడ భారతదేశ గొప్పతన్నాని, ఆధ్యాత్మికను చాటి చెప్పాలనుకున్నారు. అలా షికాగో ద్వారా భారత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు. 1893 సంవత్సరం సెప్టెంబర్ 11 న తేదీన ప్రారంభమయ్యాయి. ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ.. సూటు బూట్లతో రెడీ అయ్యి ఉంటారు. కానీ వివేకానంద దుస్తులు, వేషధారణ చూసి ఆయన్ని ఎవరూ కూడా గౌరవించలేదు. చులకనగా చూస్తారు. సభలో ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ మతాల గొప్పతనం గురించి మాట్లాడుతుంటారు. చివరగా స్వామి వివేకానంద వంతు రానే వచ్చింది. స్వామిజి నిల్చుని గంభీరమైన గొంతుతో ’అమెరికా దేశపు సోదర సోదరీ మణులారా’ అని పలకరించే సరికి ఆ ఒక్క పిలుపికి సభలో ఉన్న 4000 మందికి పైగా జనం లేచి 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారట. అప్పటి వరకు అందరు ’లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ అంటూ స్పీచ్ మొదలు పెట్టారు కానీ వివేకానంద సోదర సోదరీమణులారా అని పలకరించేసరికి ఆ పిలుపులో ఆత్మీయత వాళ్ళ హృదయాలను తాకింది.
ఏ స్వార్థం లేని పిలుపుకి కొంతమంది కన్నీరు కూడా కార్చారు. ఆ చప్పట్ల శబ్దం ఆగిన తరువాత ఆయన భారతదేశ గొప్పతనం గురించి మన దేశంలో ఆధ్యాత్మికత, సనాతన దర్మం, సంసృతి, సంప్రదాయాల గురించి ప్రసంగించారు. దానితో సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సభలో ఉన్న మేధావులు, గొప్ప గొప్ప వాళ్లంతా తమ స్థాయిని కూడా మర్చిపోయి చిన్న పిల్లల్లా ఎగబడుతూ స్టేజి వద్దకు వచ్చి స్వావిూజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అప్పటి వరకు భారత దేశం అంటే, మూఢ నమ్మకాలతో, చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్లందరికీ భారత దేశం పట్ల ఉన్న అపోహలను తొలగించారు. గౌరవం కలిగేలా చేసారు. భారత దేశపు స్థాయిని పెంచారు. ఆ తరువాత కూడా చాలా కాలం పాటు దేశమంతా పర్యటిస్తూ ప్రసంగాలు చేస్తూ, రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. 1902 సంవత్సరం జులై 4 తేదీన రాత్రి 9 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.