అభివృద్ది.. సంక్షేమం మాకు రెండు కళ్ళు: సిఎం రేవంత్‌

  • 26 నుంచి రైతుభరోసా, ’ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’
  • సాగుయోగ్యమైన భూమికి మాత్రమే రైతుభరోసా
  • ప్రజల్లోకి వాటిని సక్రమంగా తీసుకు వెళ్లాలి
  • గ్రామసభలు నిర్వహించి పక్కగా అమలు చేయాలి
  • కలెక్టర్ల సదస్సులో సిఎం రేవంత్‌ స్పష్టమైన ఆదేశాలు

హైదరాబాద్‌, జనవరి 10: ఈనెల 26 నుంచి రైతుభరోసా, ’ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పథకాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. నాలుగు పథకాల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామసభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని.. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్ధేశర చేశారు. ఈ మేరకు కలెక్టర్లతో జరుగుతోన్న సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తాను. అన్ని జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్తా. సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లించాలి. పంట వేసినా.. వేయకపోయినా.. సాగుయోగ్యమైన భూమికి రైతు భరోసా ఇవ్వాలి. అనర్హులకు ఇవ్వొద్దు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హులను గుర్తించాలన్నారు.

సాగు యోగ్యం కాని భూములను గుర్తించి మినహాయించాలి. స్థిరాస్తి భూములు, లేఅవుట్లు, నాలా కన్వర్షన్‌, మైనింగ్‌, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను సేకరించాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులను క్రోడీకరించుకోవాలి. గ్రామాల మ్యాప్‌లను పరిశీలించి క్షేత్రస్థాయిలో ధ్రువీకరించుకోవాలి. వాటిపై గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని సీఎం వివరించారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందని.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లేది కలెక్టర్లేనని అన్నారు. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం అని తెలిపారు.

కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చాం.. కానీ కొంతమంది ఇంకా ఆఫీసులలో కూర్చునే పనిచేయాలని భావిస్తున్నారని కలెక్టర్లకు సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. సమస్యలు వచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.. విూ పని తీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు.. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతు పెట్టుబడి సాయం అందించారు.. అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో వెళ్లి అనర్హులను గుర్తించాల్సిందే.. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలన్నారు. రాష్ట్రంలో వన్‌ రేషన్‌ వన్‌ స్టేట్‌ విధానాన్ని తీసుకురాబోతున్నాం.

తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్‌ కార్డు ఉండాలని సీఎం కలెక్టర్లకు చెప్పారు. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్‌ పూర్తి చేయాలని తెలిపారు. కలెక్టర్లు అర్హుల జాబితాను ఇంఛార్జి మినిస్టర్‌ కు అందించాలని సీఎం చెప్పారు. ఇంఛార్జ్‌ మినిస్టర్‌ ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలన్నారు. జనవరి 26న అంత్యంత ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేయబోతున్నాం.. ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, గొప్పగా పనిచేస్తున్నదన్న నమ్మకం ప్రజలకు కలిగించాలన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్‌ విజిట్‌ చేసి రాత్రి బస చేయాలని తెలిపారు. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్‌కు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపండని చెప్పారు. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోండి.

జనవరి 26 తరువాత తాను ఆకస్మిక తనిఖీలు చేస్తానని అన్నారు. నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కలెక్టర్లను హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు ప్రధాన పథకాలను ఈనెల 26వ తేదీ నుండి అమలుచేయాలని నిర్ణయించామన్నారు. భారీ వ్యయంతో కూడుకున్నప్పటికీ.. రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలన్న భావనతో విస్తృతంగా చర్చించిన విూదటే.. ఈ పథకాలను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే.. ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశామని.. ఈ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం తీసుకోవాలని సూచించారు. లబ్దిదారుల ఎంపికను, ప్రతీ ఉమ్మడి జిల్లాలో ఇంఛార్జి మంత్రులు ఇందిరమ్మ కమిటీలతో చర్చించిన విూదటే చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రస్తుతం నిర్ణయించే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల వివరాలను ప్రతీ గ్రామంలో ప్లెక్సీల ద్వారా ప్రకటించాలని అన్నారు. ఇప్పటికే, రాష్ట్రంలో రూ.22000 కోట్ల రైతు రుణ మాఫీలను చేశాం.. ఈ వివరాలను కూడా ప్రతీ గ్రామంలో ప్రకటించాలని తెలిపారు. ఈ నాలుగు పథకాలను సంబంధించి సవివరమైన మార్గ దర్శకులతో ఉత్తర్వులు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్దిదారులను ఎంపిక చేయాలి.. ఈ పథకాలపై జిల్లాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News