- బిల్లుకు ఆమోద ముద్ర వేసిన గవర్నర్
- సత్వరం చట్టం అమలకు చర్యలు తీసుకుంటాం
- రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి వెల్లడి
హైదరాబాద్, జనవరి 09: ‘భూ భారతి-2024’ చట్టానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది చట్టరూపం దాల్చింది. గవర్నర్ ఆమోదం తెలపటంతో వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తెస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. గవర్నర్ ఆమోదించిన భూ భారతి చట్టం బిల్లు కాపీని సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మంత్రి పొంగులేటికి అందజేశారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. చరిత్రాత్మక భూ భారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఆమోదించడంతో వీలైనంత త్వరగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజానీకానికి మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 20వ తేదీన భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం డిసెంబర్ 30వ తేదీన గవర్నర్ కార్యాలయానికి భూభారతి బిల్లు చేరింది. ఈరోజు భూభారతి చట్టానికి ఆమోదం తెలుపుతూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.దీంతో త్వరలోనే భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. మార్గదర్శకాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ఆర్వోఆర్ – 2020 వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు. కొందరికి సేవ చేయడానికి మాత్రమే పరిమితమైన రెవెన్యూ సేవలను అందరికీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేసి భూభారతి పోర్టల్ను ఏర్పాటు చేసింది. ర్వోఆర్-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ.. ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి చట్టం అమల్లోకి రానుంది. గత ఏడాది డిసెంబర్ 18న భూభారతి చట్టం బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. అదే నెల 20, 21 తేదీల్లో శాసనసభ, మండలి ఆమోదం తెలిపింది. ఆపై గర్నవర్కు ఈ బిల్లును పంపగా.. ఈరోజు భూభారతికి ఆమోదం తెలిపారు గవర్నర్.
భూభారతితో రైతులకు ప్రయోజనం చూకూరుతుందని ఇది వరకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు విస్తరించడానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. గ్రామాలలో రెవెన్యూ సేవలు అందించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని, ఇప్పటికే కసరత్తు కొలిక్కి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ ఆలోచనల కు అనుగుణంగా రెవెన్యూ విభాగం పనిచేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని.. రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ప్రత్యేక వెబ్సైట్ను మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన 95శాతం పూర్తయిందని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీలో 88శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి అయ్యిందని వివరించారు.