హైదరాబాద్, జనవరి 04: ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వెల్లడిరచారు. ఫిర్యాదు చేసే ముందు పూర్తి ఆధారాలు, వివరాలతో రావాలని రంగనాథ్ సూచించారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే 040-29565758, 040-29560596 నంబర్లను సంప్రదించాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రంగనాథ్ వెల్లడిరచారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణల పై నేరుగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి నిర్వాహించనున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదుకు సంబంధిత ఆధారాలతో రావాలని హైడ్రా కమిషనర్ సూచించింది. మొదటగా వచ్చిన 50 మంది ఫిర్యాదుదారులకు టోకెన్స్ ఇచ్చి.. టోకెన్ ప్రకారం ఫిర్యాదులు స్వీకరిస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇకపోతే హైదరాబాద్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కన్నెర్ర జేశారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డును ఆనుకొని 5 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగనాథ్ అక్కడికి వెళ్లి పరిశీలించగా.. 684 గజాల స్థలంలో సెల్లార్, గ్రౌండ్ ప్లోర్తో పాటు 5 అంతస్తుల్లో భవనం నిర్మాణంలో ఉంది. జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజు నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించారు. అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధరించాక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని హైడ్రా కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. పూర్తి వివరాలు పరిశీలించాక ఆ భవనంపై చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆర్డర్ ఆధారంగా గతేడాది మార్చిలో బిల్డింగ్ కొంతభాగాన్ని జీహెచ్ఎంసీ కూల్చేసింది. ఇవేవీ పట్టించుకోకుండా కొనసాగుతున్న ఈ బిల్డింగ్ను కూల్చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది.