రాజకీయాలకు దూరంగా ఉండండి

  • ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
  • లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

విజయవాడ, జనవరి 04: విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. కెరీర్‌ లక్ష్యంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఏపీలో ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో కెమిస్టీ, ఫిజిక్స్‌ ల్యాబ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్‌, ఎంపీ శివనాథ్‌, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేశ్‌ మాట్లాడారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని.. మంచి ఉద్యోగం వస్తే విూ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు.

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ‘మంగళగిరిలో 2019లో నేను ఓడిపోయాను. కానీ పట్టుదలతో పరిశ్రమించి రికార్డుస్థాయి మెజారిటీతో గెలిచాను. జీవితంలో గెలుపు ఓటములు సహజం. పరీక్షలు తప్పినందుకే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. విద్యార్థులు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించాం. అందుకే ప్రముఖుల పేర్లతో పథకాలు ప్రారంభించాం. సమానత్వం విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి. పుస్తకాల్లో ఆటలకు పురుషుల బొమ్మలు, ఇంటి పనులకు బాలికల బొమ్మలు ఉన్నాయి.

పాఠ్య పుస్తకాల్లో ఈ అసమానతలను తొలగించాలని అదేశించాను‘ అని లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా గతంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు జూనియర్‌ కళాశాలల్లోనూ అమలు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంటర్‌ కళాశాలల్లో నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News