విశాఖపట్నం, జనవరి 04: ‘నేవీ డే’ సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్లో భారత నౌకాదళ వాయువిభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. విన్యాసాల్లో భాగంగా భారత నౌకాదళ పాటవం, పరాక్రమం ప్రదర్శించారు. దాదాపు 8వేల అడుగుల ఎత్తు నుంచి పారాచ్యూట్ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను ఎగురవేసి ఆహుతులను ఆశ్చర్యపర్చారు. సాగర తీరంలో యుద్ధ విమానాలు, నౌకలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు సందడి చేశాయి. ఉగ్రవాదుల నుంచి బంధీలను రక్షించే క్రమంలో యుద్ధ విన్యాసాలు, సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షించే విధానం ప్రదర్శించిన తీరు సందర్శకులను ఆకట్టుకుంది. సముద్రంలో బంకర్ పేలుళ్లు అబ్బురపరిచాయి. నేవీ డే విన్యాసాలను తిలకించేందుకు వచ్చిన నగరవాసులతో సాగర తీరం జనసంద్రంగా మారింది.
