- పోటీల్లో పాల్గొననున్న 600పైగా ఎద్దులు
చెన్నై, జనవరి 04: తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడలు మొదలయ్యాయి. తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ఏటా జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు. పరుగెత్తే పశువులను పట్టుకుని నిలువరించేందుకు యువకులు ప్రయత్నిస్తారు. అలాగే గ్రౌండ్లో ఎద్దులను లొంగదీసుకుని వాటిపై ఆధిపత్యం చెలాయించేందుకు పోటీపడతారు. తాజాగా పుదుక్కోట్టై జిల్లాలో జల్లికట్టు క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తచ్చన్కురిచిలో జరిగిన ఈ జల్లికట్టు క్రీడలో తిరుచ్చి, దిండిగల్, మనప్పరై, పుదుక్కోట్టై, శివగంగై జిల్లాల నుంచి దాదాపు 600కి పైగా ఎద్దులు పాల్గొన్నాయి.
సుమారు 300 మందికిపైగా యువకులు ఎద్దులను నిలవరించేందుకు పోటీపడ్డారు. జల్లికట్టు ఉత్సవం..! తమిళనాడు రాష్ట్రంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారం..! ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు ఉత్సవం జరుపుకుంటారు. జల్లికట్టు అంటే ఎద్దులను, కోడెలను బెదరగొట్టి ఒక మార్గం గుండా గుంపులుగా వదిలిపెడుతారు. గుంపులుగా పరుగులు తీస్తున్న ఎద్దులను యువకులు లొంగిదీసే ప్రయత్నం చేస్తారు. అలా లొంగదీసిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. జనవరి నుంచి మే 31 మధ్య సాధారణంగా 120కిపైగా జల్లికట్టు ఈవెంట్లు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయ ఎద్దుల క్రీడలను చూసేందుకు తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు.